Saturday, September 29, 2012

పునాది గట్టిగా ఉంటేనే...తొలి చదువులు - 12


                                                                       29-9-2012

భాష మనుషుల నడుమ సంగతుల మార్పిడి కోసం వాడే ఓ పనిముట్టు. తనకు తెలిసిన సంగతిని ఇంకొకరికి తెలపాలన్నా, మరొకరి నుండి సంగతులు తెలుసుకోవాలి అన్నా వారిమధ్య సమాచార మార్పిడి జరగాలి. ఇది జరిగేటప్పుడు భాష రెండు పాత్రలను పోషిస్తుంది. ఒకటి ‘చెప్పే’ది (ఎక్స్‌ప్రెస్సివ్) రెండోది ‘తీసుకొనే’ది (రిసెప్టివ్). సమాచార మార్పిడి జరిగేటప్పుడు ఈ రెండు పనులు ఒక దానిని బట్టి రెండోది ఇచ్చి పుచ్చుకుంటూ ఒకే కాలంలో, సులువుగా, ప్రయత్నం లేకుండా జరగాలి. మాటల్లో దిగిన ఇద్దరి మనుషుల భాష ఒకటే అయినప్పుడే భాష ఈ రెండు పాత్రలను పోషిస్తుంది.


అంటే వారి మనసుల్లో భాషకు సంబంధించిన ఒకే ‘‘ప్రోగ్రామింగ్’’ ముందుగానే జరిగి ఉండాలి. పుట్టినప్పటి నుండి బిడ్డలో జరిగే ఈ ప్రోగ్రామింగే భాష నేర్చుకోవటం. ఇందులో తల్లిదండ్రులది, కుటుంబ సభ్యులది కీలక పాత్రే అయినప్పటికీ, మొత్తం భాష ఎదుగుదలలో సింహభాగం పాత్రను పోషించేది సమాజమే. మన సమాజం మనకు తెలుగులో ‘‘ప్రోగ్రామింగ్’’ జరిపితే, తమిళులకు తమిళ భాషలో ‘‘ప్రోగ్రామింగ్’’ జరుగుతుంది. ఎవరికి ఏ భాషలో ‘‘ప్రోగ్రామింగ్’’ జరుగుతుందో దాన్ని మట్టుకే అర్థం చేసు కోగలరు. ఇతర భాషలో మాట్లాడితే అర్థం చేసు కోలేరు. ఒక వేళ ఇతర భాషను అర్థం చేసు కోవాలి అంటే దానికి సంబంధించి ‘‘ప్రోగ్రామింగ్’’ ఆ వ్యక్తుల్లో జరగాలి. అంటే ఆ భాషను అదే పనిగా నేర్చు కోవాలి.

చెప్పటం, దాని మరో రూపం అయిన రాయటం అంటే మనసులో వచ్చే ఆలోచనలను ఇతరులకు తెలియ జేయటం. తను చెప్పదలుచుకున్న భావం మనసులో పుట్టగానే ఆ భావాన్ని బయటకు తెలియచేయటానికి కావల్సిన పదాలను మదిలో వెతుక్కోవాలి. అంటే అలాంటి పదాలు అంతకుముందే మెదడులో నమోదు అయి ఉండాలి. అప్పుడే సంబంధిత పదాలను గుర్తుకు తెచ్చుకుంటూ, వాటికి వ్యాకరణాన్ని జోడిస్తూ మాటలాడుతాం. మాట్లాడేటప్పుడు మనలో ఉండే ఉద్వేగాలకు తగ్గట్టు గొంతులో హెచ్చు తగ్గులతో, ముఖ కవళికల్లో హావభావాలు కలిపి మాట్లాడుతాం. ఇందుకుగాను ముందుగా మన మనసులో పదాల మూట ఉండాలి. పదాలతో కట్టుకున్న సొగసులూ, సొబగులు, అంద చందాలు మనసులో ఉండాలి. అంటే మాట కట్టు, క్రియ మార్పులు, ఉపమానాలు, పోలిక. జాతీయాలు, సామెతలు. ఎత్తిపొడుపులు ఇవి అన్నీ ఉంటేనే ఆ వ్యక్తి మాటల్లో, రాతల్లో అసలుదనం ఉంటుంది. నేర్చుకొనేటప్పుడు భాషా పదాలు, దాని సొగసులు ఎంత స్వచ్ఛంగా నమోదు అయితే ఆ వ్యక్తి మాట్లాడే భాష కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది.

మన పిల్లల్లో బడికి పోనంతవకు ఇంటా, బయటా తెలుగు పదాలు నమోదు అవుతూ ఉంటాయి. బడికి వెళ్ళటం మొదలు అయ్యాక తెలుగు పదాలకు బదులు ఇంగ్లీషు పదాలు నమోదు కావటం మొదలవుతుంది. దాంతో నిత్యం మనం వాడే కుక్క, పిల్లి, బొమ్మ, నీళ్లు లాంటి పదాలకు బదులు ‘‘డాగ్, క్యాట్, డాల్, వాటర్’’అని నమోదు కావటం మొదలు అవుతుంది.

లేత వయసులో ఏ పదాలు అయితే నమోదు అవుతాయో వాటి పునాది మీదే ముందు ముందు ఆ వ్యక్తి మాట్లాడే భాష స్వచ్ఛత ఆధార పడి ఉంటుంది. కాబట్టి చిన్నతనంలో ఎక్కువ ఇంగ్లీషు పదాలు నమోదు అయితే ఆ వ్యక్తి మాటల్లో కూడా ఎక్కువ ఇంగ్లీషు పదాలు దొర్లుతూ ఉంటాయి. నిజానికి ఆంగ్లం పరాయి భాష అయినప్పటికీ, బిడ్డకు సంబంధించిన అంత వరకు ఆంగ్ల పదాలు కూడా సొంత భాషా పదాల కిందే లెక్క. 

సొంత భాష అంటే ఇంట్లోనూ, బయటా మాట్లాడేభాషే కాబట్టి సమాజంలో ఎంత ఆంగ్లం కలిసి ఉంటుందో బిడ్డలో కూడా అదే స్థాయిలో కలిసి పోయి ఉంటుంది. దానికి తోడు బిడ్డకు నేర్పాల్సిన తెలుగు పదాలను నేర్పకుండా ఇంగ్లీషు పదాలను నేర్పటంతో తెలుగు స్వచ్ఛత దెబ్బ తింటుంది. ఈ విధంగా ఒక తరం గడిచే సరికి తెలుగుదనం తగ్గి అందులో ఆంగ్లదనం పెరుగుతుంది. దీనిలో భాగమే మనం రోజూ తినేటప్పుడు మాట్లాడే ‘‘పళ్లెం,ఉప్పు, నీళ్లు, అన్నం’’ లాంటి పదాలు మన నోళ్ళలో నుండి మాయం అయి ‘‘ప్లేటు, సాల్టు, వాటరు, రైసు’’ అనే పదాలు రావటం. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు వాడే ‘‘అలాగే... సరే.. ఆహా.. అవునా... ఊ..’’లాంటి పదాలకు బదులుగా ‘‘ఓకే..., యస్..’’లతో నిండిపోయాయి.

పిల్లలకు భాష నేర్పేటప్పుడు జరిగే ఈ కలితీ వల్ల వారిలో బలమైన భాష పునాది ఏర్పడదు. చిన్న తనంలో నేర్చుకొనే సొంత భాష, దాని నాణ్యత, దాని సొగసు, మాటతీరు ఎంత బాగా ఉంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వం అంతగా ఎదుగుతుంది. మరో తమాషా ఏమిటంటే ఇలా సొంత భాష పునాది బలంగా ఉన్నప్పుడు పెద్దయ్యాక ఎన్ని భాషలు నేర్చుకున్నా ఆ నేర్చుకున్న భాషల అన్నింటిలోనూ తల్లి నుడిలో ఉన్నంత పట్టు ఒద్దు అన్నా ఒచ్చి తీరుతుంది. ఇంగ్లీషు మీడియంలో చదివిన పిల్లలకు మంచి ఇంగ్లీషు రాక పోవటానికి కారణం ఇదే.

Tuesday, September 25, 2012

సమాజానికి అద్దంపట్టే పిల్లల భాష - తొలి చదువులు - 11

23-09-2012


మానవుడి భాష ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? అనే అడకలకు పూర్తి జవాబులు ఇంత వరకూ తెలియదు. ఈ నేల మీద మానవుడికి మాత్రమే మాట్లాడే నుడి ఉంది. భాష ఏది అయినా అది రూపు దిద్దుకొనే విధానం, ఎదిగే పద్ధతి విశ్వ వ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. ఒక నుడిని నేర్చుకొన్నాక దాని ద్వారా ఎన్ని నుడులు అయినా నేర్చు కోవచ్చు. నేర్చు కొనే భాషతో వ్యక్తికీ, జాతికి కొన్ని అవసరాలు ఉంటాయి. భాష ఆ అవసరాలను తీర్చడానికి ఉపయోగ పడాలి. ఆంథ్రోపాలజిస్టులూ, మానసిక నిపుణులు, భాషా శాస్తవ్రేత్తలు గుర్తించిన అవసరాలు ఇవి. .
  •  భాష మనిషి సంఘ జీవితానికి ఓ పని ముట్టులా ఉపయోగ పడాలి. 
  • ఇతరులను అదుపు చేయటానికి పనికి రావాలి. 
  • తనను తాను ఇతరులతో కలుపు కోను ఉపయోగ పడాలి. 
  • తన గురించి తాను తెలుసు కోను భాష కావాలి. 
  • ఇతరులనుండి సంగతులు తెలుసు కోటానికి.  
  • ఊహలకు, నమ్మకాలకు భాష కావాలి. 
  • తన ఆలోచనలను, ఊహలను ఇతరులకు తెలియ చేయటానికి భాష ఉపయోగ పడాలి.
వీటిలో ఏ ఒక్క అవసరం తీరక పోయినా ఆ భాష, ఆ వ్యక్తికి పూర్తిగా ఉపయోగ పడినట్టు కాదు. ఈ పనులను, అక్కరలను పూర్తిగా, సుళువుగా ప్రయత్నం లేకుండానే అలవోకగా ఉపయోగ పడేదే సొంత భాష. అదనపు భాషగా దేన్ని నేర్చుకున్నా, పైన చెప్పిన అవసరా లలో కొన్నింటినే నెర వేర్చ గలదు. నేర్చుకున్న అదనపు భాష తన అవసరాలు అన్నింటిని తీరుస్తుందని ఎవరైనా అనుకుంటే అది కేవలం వీలుకాని అనిపింపు మట్టుకే.

మానవుడికి ఏ భాషా పుట్టుకతో రాదు. దాన్ని నేర్చు కొనే చేవ మట్టుకే వారసత్వంగా వస్తుంది. చేవ వచ్చినా బిడ్డకు భాష నేర్పేది సమాజమే. బిడ్డలు ఎదిగే కొద్దీ భాషను విన టానికి అలవాటు పడటం, అర్థం చేసు కోవటం, ఆ తరువాత మాట్లాడ టానికి ప్రయత్నించటం అనే వరుస పద్ధతిలో నేర్చుకుంటారు. భాష లేక పోతే మనం ఏదీ నేర్చు కోలేము. భాష లేక పోతే మనకూ జంతువు లకూ తేడా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ఎదుగుదల భాష తోనే మొదలు అవుతుంది, భాష ద్వారా జరుగు తుంది. భాష నేర్చు కోవటానికి పరిసరాల ప్రేరణ కావాలి. ఇక్కడ పరిసరాలు అంటే సమాజం, అందులో వుండే వ్యక్తులు, వారు మాట్లాడే భాష.


బిడ్డ భాష నేర్చుకొనే తంతు పురిటి లోనే మొదలు అవుతుంది. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు నులి వెచ్చగా, చీకటిగా, కుదుపు లేకుండా హాయిగా ఉంటాడు. తల్లికి నొప్పులు వచ్చి కాన్పు జరగగానే బయట వాతావరణపు ఒత్తిడి, చలి, బిడ్డ ఒంటికి తగులుతాయి. ఒత్తిడి, చలి, బిడ్డ ఒంటికి కొత్త అనిపింపులు. అలాగే వెలుతురు కళ్ళకు కొత్త అనిపింపు. పుట్టిన వెనువెంటనే ఈ అనిపింపులు తొలిసారిగా పిల్లవాడి మెదడులో రికార్డు అవుతాయి. అయితే ఈ కొత్త అనిపింపు లకు ఉన్నట్టు ఉండి గురి కావటంవల్ల వెలుతురు తగలగానే కళ్లు మూస్తాడు. కాని చలి నుండి తనను తాను కాపాడుకోలేడు. కాబట్టి ‘నన్ను కాపాడండో!’ అని తన అక్కరను ఏడుపు ద్వారా తెలియజేస్తాడు. ఇది బిడ్డ ఉపయోగించే తొలి భాష. మరో రెండు నెలలకు ఎదుటివారిని చూసి హాయిగా నవ్వు తాడు. ఆ విధంగా ఏడవటం, నవ్వటం అనేవి భాషకు సంబంధించిన తొలి రూపాలు. ప్రపంచంలో ఉన్న బిడ్డలంతా ఒకే రకంగా ఏడుస్తారు, నవ్వుతారు. తెలుగు నవ్వు, ఇంగ్లీషు ఏడుపు అంటూ ఏమీ ఉండవు. ఇది విశ్వభాష. వయసు పెరిగేకొద్దీ వారి వారి చోటు భాషలకు అలవాటుపడతారు.

అప్పుడే పుట్టిన బిడ్డ మెదడు ఖాళీ సీడీలాంటిది. చూసిన పరిసరాలను, విన్న సవ్వడులను నమోదు చేసుకోగల చేవను కలిగి ఉంటుంది. బిడ్డ సమాజంలో పెరుగుతాడు కాబట్టి పుట్టిన నాటి నుండి మేనుక (ఫిజికల్), సామాజిక పరిసరాలనుండి వచ్చే ప్రేరణలు మెదడులో నమోదు అవుతూ వుంటాయి. పరిసరాలు, సమాజం నుండి వచ్చే ప్రేరణలను మనసుకు చేర వేసేది చూపు, వినికిడి, వాసన, తాకిడి, రుచి. వీటి ద్వారా మెదడులో రికార్డు అవుతాయి. ఆదిలో బిడ్డ చూపు, వినికిడికి మట్టుకే స్పందిస్తాడు. రాను రాను సామాజిక ప్రేరణలకు స్పందించటం మొదలు అవుతుంది. ముందుగా నమోదు అయ్యే మేనుకలకు సామాజిక అర్థాలు, అనిపింపులు జతకావటంతో భాష పెరగటం మొదలవుతుంది.

పైన చెప్పిన అయిదు మేనుక ప్రేరణలలో వినికిడి తప్ప మిగిలిన నాలుగు మేనుకలు అంటే చూపు, వాసన, తాకిడి, రుచి ద్వారా మెదడుకు చేరే సమాచారం ప్రపంచంలో ఏ బిడ్డకు అయినా ఒకేలా ఉంటాయి తప్ప వీటికి జాతి, తావు అనే తేడాలు ఉండవు. మచ్చుకు నింగిలో ఉన్న చందమామ మన పిల్లవాడికి అయినా, అమెరికా పిల్లవాడికి అయినా ఒకేలా కనిపిస్తుంది. అలాగే మల్లెల వాసన, చీమ కుట్టిన నొప్పి, పాల రుచి అందరు బిడ్డలకి ఒకలాగే మెదడులో నమోదు అవుతాయి. అయితే వినటం ద్వారా నేర్చుకొనే భాష దగ్గరకు వచ్చేసరికి తేడా వస్తుంది. మనం పలుకే మాట సవ్వడి మేనుక  (ఫిజికల్) ప్రేరణే అయినప్పటికీ పలికే విధానం, ఆ పలుకుకు అర్థం ఆయా తావులను బట్టి తేడాగా ఉంటుంది. ఏ సమాజంలో ఉంటే ఆ భాషను నేర్చుకొని తీరాల్సిందే. ఒక రకంగా చెప్పాలి అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు ఉమ్మడిగా ఉపయోగించే నోటి సవ్వడులే బిడ్డలో భాషగా రూపు దిద్దుకుంటాయి 

Saturday, September 15, 2012

‘బట్టీ ’ విక్ర 'మార్కులు’ -తొలి చదువులు-10


15-9-2012

నేర్చుకోవాల్సిన సంగతులు అర్థం కాక పోయినా, గజిబిజిగా ఉన్నా సరిగా గుర్తు ఉండవు. అవసరాల రీత్యా అలాంటి వాటిని గుర్తు పెట్టుకోవాల్సి ఒస్తే  వాటిని పదే పదే వల్లె వేసి మనసులో నాటుకుంటాం. ఆ పద్ధతినే మనం ‘కంఠస్థం’ చెయ్యటం లేదా ‘బట్టీ’ పట్టడం అంటాం. సంగతి ఎంత కఠినంగా ఉంటే బట్టీ పట్టడం అంత కష్టంగా ఉంటుంది. దానికి పట్టే సమయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. మచ్చుకు అర్థం తెలియని సంస్కృత శ్లోకాలు బట్టీ పట్టటానికి చాలా శ్రమ పడాలి. అదే వేమన పద్యాలకు అంత కష్టం పడాల్సిన అక్కర లేదు. కారణం అది వాడుక భాషలో ఉండి అర్థం కావటం. 

భాష మీద పట్టు లేకుండా చదివితే అర్థం కాదు. అర్థం కానప్పుడు దాన్ని గుర్తు పెట్టు కోవాలి అంటే ఉన్న ఒకే ఒక దారి దాన్ని కంఠస్థం చేయటం. ప్రాథమిక చదువును ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలకు భాష మీద అప్పుడే పట్టు ఉండదు. కాబట్టి వారిది బట్టీ దారే. ఈ మీడియంలో చదివే పిల్లలను బాగా గమనిస్తే వారు మూడు రకాలుగా బట్టీ పట్టటానికి అలవాటు పడుతారు. 

వీరిలో మొదటి రకం- పిల్లలు, చదివింది అర్థం కానప్పుడు మార్కుల్లో వెనుక పడి పో కూడదు అని వారంతట వారే బట్టీ పద్ధతికి మల్లుకుంటారు. భాష మీద పట్టు లేనందువల్ల టీచరు చెప్పేదీ, పుస్తకాలలో చదివేది సరిగా అర్థం కాక, అంతో ఇంతో అర్థం అయినా చెప్పటానికి లేదా రాయటానికి భాష చాలనందు వల్ల ఎందుకు వచ్చిన గొడవలే అని బట్టీకి మల్లుకుంటారు. 

రెండో రకం - టీచర్లే బట్టీ పద్ధతికి అలవాటు చేయటం. అర్థం కాని చదువులతో పిల్లలకు మార్కులు రావు. మార్కులు తెప్పించాలి అంటే ఉన్న ఒకే ఒక దారి బట్టీ. బట్టీ పట్టించటానికి వీలుగా అచ్చు పుస్తకాన్ని వదిలి ‘ప్రశ్నలు - జవాబులు’లతో కూడిన ‘స్టడీ మెటీరియల్’ అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు. వీటిని బట్టీ పట్టటం పిల్లలకు చాలా సులువు. ఉన్న పుస్తకాలకు తోడు ఆరు సబ్జక్టులకు ఆరు అదనపు స్టడీ మెటీరియళ్లు వచ్చి చేరటంతో ఇప్పుడు పిల్లలకు మోత బరువు పెరిగింది. 

ఇక మూడో రకం- బాగా తెలివి ఉన్న పిల్లలు ఇంగ్లీషు చదవటం, రాయటం, మాట్లడటం, అర్థం చేసుకోవటం బాగా వచ్చినప్పటికీ సొంతంగా రాసిన దాని కంటె మూస జవాబులకే ఎక్కువ మార్కులు వేస్తారు కాబట్టి సొంతంగా రాసి మార్కులు తగ్గించు కోవటం ఎందుకులే అని వారు కూడా బట్టీకే మల్లుకుంటారు. ఈ పద్ధతికి కేజి క్లాసులో విత్తనం పడి, తరగతులు పెరిగే కొద్దీ మాను అవుతూ ప్రతిదీ బట్టీ పెట్టే స్థాయికి అలవాటు పడతారు. 

అర్థం చేసుకొంటూ చదివితే అర గంటలో అయి పోయే పాఠాన్ని మూస సమాధానాల కోసం రోజులు తరబడి బట్టీ పద్ధతిని పాటించటం వల్ల అందుకు ఎక్కువ సమయం పడుతుంది. పయిగా  బట్టీ పద్ధతిలో చదివింది సరిగా గుర్తు ఉండదు కాబట్టి మరిన్నిసార్లు చదవాల్సి వస్తుంది. చదువు కోసం కేటాయించాల్సిన సమయం విపరీతంగా పెరిగి పోవటంతో పిల్లలకు ఆటలకు, సామాజిక కార్యక్రమాలకు కేటాయించాల్సిన వేళల్లో కోత పడుతుంది. దీని వల్ల పిల్లలకు సమాజీకరణ, మానవ సంబంధాలు, సర్దుబాటుతత్వం లాంటి సున్నితమైన జీవిత మెలకువలు (సాఫ్టు స్కిల్సు) నేర్చుకొనే అవకాశం లేకుండా పోయింది. ఇది ఇంతటితో ఆగితే నయం. చదువులో పోటీ ఉందనే నెపంతో ఇంకా బాగా బట్టీ పట్టించ టానికి పగలు సమయం చాలక నిద్ర వేళల్లో కూడా కోత పెట్టటం జరుగుతుంది. ఎగువ తరగతులు, ఇంటరు చదివే పిల్లలు ఎంత సేపు నిద్ర పోతారో ఒక సారి ఆ పిల్లలను అడిగి చూడండి. 

నేర్చుకొనే చదువును పరికించి (అబ్జర్వేషను), విడమరిచి (అనాలసిస్) అర్థం చేసుకొని చదివిన వారికి, భాష మీద పట్టు లేకుండా కేవలం బట్టీ పట్టి చదివిన వారికి ఉండే తేడాలు  ఇలా  ఉంటాయ.

                విడమరుపు చదువు                                     బట్టీ చదువు

  • భాష రావాలి                                                అక్షరాలు ఒస్తే చాలు భాషతో పని లేదు 
  • అర్థం అవుతుంది                                         కావచ్చు కాక పోవచ్చు
  • బాగా గుర్తుంటుంది                                      పరీక్షల వరకే గుర్తుంటుంది
  • వయసుకు లోబడి ఉంటుంది                        వయసుతో పని లేదు
  • భాష మీద పట్టు ఉండాలి                              భాషతో పని లేదు
  • మొత్తం మెదడుకు పని                                కేవలం జ్ఞాపకపు చేవకే పని
  • మార్కులు రా ఒచ్చూ రాక పో ఒచ్చు             మార్కులు ఒచ్చి తీరుతాయి
  • నిజమయిన ప్రతిభ                                      కేవలం కనిపించే ప్రతిభ
  • మంచి టీచరు అవసరం                                మంచి స్టడీ మెటీరియలు అవసరం
  • చదువుమీద ఆసక్తి ఉంటుంది                       మరతనం (మెకానికల్)గా ఉంటుంది
  • ఒత్తిడి ఉండదు                                            ఒత్తిడికి గురవుతారు
  • నిజమయిన ఎదుగుదల-                             ఒక దగ్గర ఆగి పోతారు

Sunday, September 9, 2012

అడ్డ దారిలో బోధన: తొలి చదువులు-9


                                                                            8-9-2012
                   
చాలా మంది తల్లిదండ్రులకు, ఆ మాటకు వస్తే బాగా చదువుకున్నవారిలో కూడా నాటుకు పోయిన ఒక పొరపాటు అనిపింపు ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు మీడియంలో చదివితే పిల్లలు దాన్ని బాగా మాట్లాడ గలరు అని. ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, చదువు అంటే కేవలం ఇంగ్లీషులో మాట్లాడటమే కాదు. ఎఱుకువ (నాలెడ్జి)ను నేర్చు కోవటం. ఎఱుకువను పొందటానికి ఏ భాష అయినా ఒక్కటే.


కాకుంటే ఏ భాష ద్వారా నేర్చుకుంటున్నారో ఆ భాష మీద పట్టు ఉండాలి. పసి వయసులో అలాంటి పట్టు ఉండేది వారి సొంత భాషలోనే. లేత వయసులో సొంత భాషలో అర్థం అయిన అంతగా ఇతర మరే భాషలోనూ అర్థం కాదు. వచ్చీ రాని భాషలో చెప్పటంవల్ల చెప్పిన సంగతులు మొత్తంగా అర్థం కావు. చదువు అర్థం కాక పోతే పిల్లలు ఎంత మర తనానికి (మెకానికల్) అలవాటు పడతారో ఇంగ్లీషులో నేర్చుకొనే ఎక్కాలను చూస్తే తెల్లం అవుతుంది.
రెండో తరగతి చదివే పిల్లల్ని పిలిచి  'ఫోర్తు టేబులు’ చెప్పమని అడగండి.

                 ఫోర్  వన్ ‘జార్’ ఫోర్           four  ones   jar  four
                 ఫోర్  టూ ‘జార్’ ఎయిట్       four  twos   jar  eight
                 ఫోర్ త్రీ ‘జార్’ ట్వల్వ్            four threes jar  twelve
                 ..........................
                 ..........................
అంటూ చెప్పుకుంటూ పోతారు. మధ్యలో ఆపి ‘జార్’ అంటే ఏమిటి అని అడగండి. నూటికి 99 మంది పిల్లలు చెప్ప లేరు. ఇంతకూ ఈ ‘జార్’ అనేది ఏమిటి అంటే నాలుగో ఎక్కాన్ని ఇంగ్లీషులో 
                      ఫోర్  వన్స్ ఆర్ ఫోర్      four  ones   are  four
                      ఫోర్ టూస్ ఆర్ ఎయిట్  four  twos   are  eight
                      ఫోర్ త్రీస్ ఆర్ ట్వల్వ్’’    four threes  are twelve
అంటూ వల్లించాలి. ఇలా పలికేటప్పుడు (ఫోర్) వన్స్ + ఆర్ కలిపి పలికేటప్పుడు ‘వన్స్ - ఆర్’ల నడుమ సంధి ఏర్పడి ‘వన్సార్’ అయింది, ఆ పదమే రూపాంతరం చెంది ‘వన్జార్’ అయింది. తరువాత ‘వన్’ దాని నుండి విడి పోయి ‘జార్’ మట్టుకు మిగిలి ఉంది. ఇలాగే ‘టూ జార్’ ‘త్రీ జార్’లు. అంటే ‘ఆర్’ కాస్తా ‘జార్’ అయ్యింది. అంటే ఇది ‘ఇంగ్లీషు సంధి’ అన్న మాట. ఈ సంగతి ఎంత మంది టీచర్లకు తెలుసూ? ఇలా పలకటంలో పిల్లల తప్పేమీ లేదు. టీచర్లు ఎలా చెబితే పిల్లలు అలానే బట్టీ పెడుతున్నారు., అంతే. అర్థం తెలియకుండా బట్టీ పెట్టటానికి ఇది ఒక మచ్చు మాత్తరమే.

ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలకు లెక్కలు నేర్పించే పద్ధతి చూస్తే సరళంగా ఉండే చిన్న చిన్న సంగతులను కూడా ఎంత చిక్కుగా, గందరగోళంగా బోధిస్తారో మనం గమనించవచ్చు. కూడికలు, తీసివేతలు నేర్పించటానికి పిల్లలకు ‘వేళ్ళ’ పద్ధతి అలవాటు చేస్తారు. 3 ప్లస్ 2 ఎంత అని పిల్లల్ని అడిగితే వాళ్ళు వెంటనే ‘‘టేక్ టూ ఫింగర్స్, త్రీ ఆఫ్టర్, ఫోర్.. ఫైవ్...’’ అంటూ ఒక్కొక్క వేలుని ముడుస్తూ ‘ఫైవ్ అంకుల్’’ అంటారు. మనం ‘‘2 ప్లస్ 2’’ ఎంత అని అడిగినా, వాళ్ళు ఆ పద్ధతి ప్రకారమే చెబుతారు తప్ప వెంటనే  'ఫోర్'  అని బదులు చెప్పరు. ఇచ్చిన లెక్క పదికి మించితే కాలి వేళ్ళను కూడా లెక్కేసే పిల్లలు కూడా లేక పోలేదు. ఇదే లెక్కని ‘‘నీ దగ్గర త్రీ చాకోలేట్లు ఉంటే నేను టూ టాక్లేట్లు ఇస్తే, నీ దగ్గర మొత్తం ఎన్ని ఉంటాయి? అని అడిగితే ఠక్కున ‘ఫైవ్’ అంటారు. ఇక్కడ పిల్లలకి అర్థం కావాల్సింది మూడు, రెండు కలిపితే ‘అయిదు’ అవుతుంది అనేది మట్టుకే. మాటల్లో కష్టం కాని కూడిక ‘చదువు ‘మోడ్’లోకి పోగానే వేళ్ళు ముడిచి తెరిచే మూస తీరులో కుదురుకొని కష్టం అయి కూర్చుంటుంది. తప్పుడు పద్ధతిలో నేర్పిన ఫలితం అది.

మరో మచ్చుక. మానసిక ఎదుగుదల రాకుండా లెక్కలను నేర్పిస్తే ఎంత మరతనానికి అలవాటుపడతారో చూద్దాం. అయదో తరగతి చదివే పిల్లలను పిలిచి 658లో నుంచి 469  ని తీసివేయమని అడగండి. చాలామంది పిల్లలు ‘‘తీసివేత అంటే ఏమిటి అంకుల్’’ అని అడగవచ్చు. దడుచుకో  ఒద్దు. వారికి నిజం గానే తెలియదు. అలా అడిగినప్పుడు ‘సబ్‌స్ట్రాక్షన్’ అని కానీ, ‘మైనస్’ అని కానీ చెప్పక తప్పదు. ఆ లెక్కని ఒప్పుగా చేసినా తప్పుగా చేసినా చేసే తీరు మాత్తరం 100 శాతం మంది పిల్లలు ఇలా చేస్తారు.                        

658 లో ఒకట్ల స్థానంలో ఉన్న 8 లో నుంచి కింద ఉన్న 9 పోదు కాబట్టి పదుల స్థానంలో ఉన్న 5 లో నుంచి ఒకటి అప్పు తెచ్చుకోవాలి. ఒకటి అంటే పది అని అర్థం. ఆ లెక్కన 8కి 10 కిలిపితే 18 అవుతుంది. లెక్క చేసే పిల్లలు ఏం చేస్తారంటే 8 ని కొట్టేసి దాని నెత్తిన 18 ని రాస్తారు. అలాగే 5లో నుండి ఒకటి పోయింది కాబట్టి దాన్ని కూడా కొట్టేసి 5 నెత్తిన 4 వేస్తారు. ఇలా ఎన్ని అంకెల్ని తీసేయాలన్నా కొట్టెయ్యటం దాని నెత్తిన రాసేయటం. ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లల్లో పదో తరగతి దాటాక కూడా ఈ జాడ్యం వదలదు.

ఈ కష్టం అంతా ఎందుకు వచ్చింది అంటే నోటి లెక్కలు చేసే వయసు రాక ముందే లెక్కలు నేర్పటంవల్ల. తగిన వయసు రాకుండా నేర్పేటప్పుడు సులభంగా నేర్పుతున్నాము అనే పేరులో ‘అడ్డదారి’ (షార్ట్‌కట్) తొక్కిస్తారు. ఇలా అంటుకున్న జాడ్యం అంత తొందరగా వదలదు.

పిల్లలకు తగిన వయసు వచ్చాక లెక్కలు చెప్పటం మొదలుపెడితే ఇలాంటి డొంక తిరుగుడు పద్ధతుల్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉండదు. శాస్ర్తియంగా కూడికలు, తీసి వేతలు నేర్పాల్సింది ఏడో ఏట. లెక్కలు చెయ్యటానికి వీలుగా మానసిక పరిణతి ఆ వయసుకు జరిగి ఉంటుంది. బడి మొహం తెలియని వయసున్న ఓ పిల్లాడిని పిలిచి ‘‘ఐదు, ఆరు కలిపితే ఎంత?’’ అని అడగండి. వెంటనే ‘పదకొండు’ అంటాడు. ఏమిటో! చదువుకో కుండా అల్లరి చిల్లరి గా విడిలో తిరిగే పిల్లలు  చేసే వాటి లెక్కలు కుడా  కార్పొరేటు బడి పిల్లలు చేయలేక పోవటం. 

Saturday, September 1, 2012

విద్యలందు తొలి విద్య వేరయా... -- తొలి చదువులు-8


                                                                      01-09-2012

బిడ్డల ఎదుగుదల పుట్టిన అప్పటి నుంచి అంచెల వారీగా జరుగుతుంది. అందులో తొలి అయిదు ఏళ్ళు బిడ్డ దాదాపు ఇంటికే పరిమితం కాగా మలి అయిదు ఏళ్ళలో ఇంటి నుంచి సమాజం లోకి వచ్చే అంచె. అంటే బయటి ప్రపంచం లోకి తొంగి చూడటానికి ఇది తొలి మెట్టు. బిడ్డలను విద్యా వంతులుగా తీర్చిదిద్దటంలో తొలి విద్యకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రాథమిక విద్య అంటే కేవలం చదవటం, రాయటం నేర్చు కోవటమే కాదు. బిడ్డ మొత్తం ఎదుగుదలకు పునాది వేయటం, ఇంట్లోనుంచి సమాజంలోకి మళ్లించటం. ఈ అంచెలో బిడ్డ తన గురించి, తన కుటుంబాన్ని గురించి, చుట్టూ ఉన్న సమాజం, పరిసరాలను గురించి తెలుసు కోవాలి. సమాజపు నియమాలూ, జనంతో సంబంధాల గురించి తెలుసు కోవాలి. ఈ అంచెలో అందించే విద్యలో బిడ్డ ఎదిగాక ఏమి అవుతారు అనే దానితో సంబంధం లేకుండా ఉండాలి. తొలి విద్య పూర్తి అయ్యే నాటికి బిడ్డకు ఈ కింద సంగతుల పయిన కనీసం అవగాహన పొంది ఉండాలి.

  • తన సొంత భాషను బాగా మాట్లాడటం, చదవటం, రాయటంలో పట్టు కలిగి ఉండాలి.
  • ఇతరుల నుండి, ప్రసార సాధనాల నుంచి (రేడియో, టీవీ, పత్రికలు, సినిమాలు) పొందే సమాచారాన్ని విని అర్థం చేసుకో గలిగి ఉండాలి.
  • అర్థం చేసుకొనేటి అప్పుడు అసమగ్రంగా తోచిన వాటి గురించి స్వేచ్ఛగా, సంకోచం లేకుండా అడిగి చెప్పించుకో గలగాలి.
  • ఇతరులు ఇచ్చే సూచనలను అర్థం చేసుకో గలిగి, వాటికి బదులు, వివరణలు ఇవ్వ గలగాలి.
  • తన భావాలను, ఉద్వేగాలను స్వేచ్ఛగా తెలియ జేసే మెళకువలు ఉండాలి.
  • తనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులతో స్వేచ్ఛగా రాత రూపంలో కానీ, మాటల రూపంలో కానీ పంచుకో గలగాలి.
పయి  సంగతులను ఒక సారి బాగా పరికించి చూస్తే అవి అన్ని భాషతో జరగాల్సిన పనులు. భాష నేర్చు కోవటమే కాకుండా దాన్ని ఉపయోగించి సమాజంతో మమేకం అవుతూ ఆ మెళకువలను నేర్చుకోవాలి. బడి విద్య, సమాజం అందించే ఎఱుకువ (నాలెడ్జి)కు కొనసాగింపే కాని ప్రత్యామ్నాయం కాదు. విద్యలో నేర్పించే సంగతులు  సమాజం లోనివిగా ఉండాలి. అప్పుడే బిడ్డలు చదివిన వాటిని సమాజంతో సమన్వయ పరచుకొని ఎదుగుతారు. చదివే సంగతులతో పిల్లలకు సంబంధం లేక పోయినా, చెప్పేది అర్థం కాకపోయినా వాటిని సరిగా అరిగించు కోలేరు. అందువల్ల పుస్తకాలలో ఉన్న సంగతులు బుర్రలోకి దూరేది తక్కువ. పిల్లలకు భాష పయిన  పూర్తి పట్టు రాకుండా చదివితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇంగ్లీషు మీడియంలో నాలుగు లేదా అయిదో తరగతి చదివే మీ పిల్లల చేత "Magic pot'' వార ఫత్రికలో అచ్చు అయిన ఈ సరళ కథను చదివించండి లేదా మీరే చెప్పండి. తెలుగులో దాని అర్థం చెప్పొద్దు.
Long long ago, A proud woodpecker called Woody living in a forest. He always frightened small animals and birds by saying ""Hey! Don't you dare come near me! I will peck you with my sharp beak!'' At times, in a fit of anger, he actually pecked some small birds hard with his beck. No one wanted to be friends with Woody because they were afraid of being pecked. 

One day, as Woody sat on a jack fruit tree, he proudly pecked a huge, jack fruit. But alas! He did't know that he had pecked an unripe jack fruit! The sticky sap from the fruit oozed out, and stuck Woody's beak. He couldn't open his mouth! Woody flew through the jungle with his upper and lower beak stuck together. The other animals and birds in the forest made fun of him. Woody hung his head in shame the flew away quickly.
కథ పూర్తి అయిన తరువాత తిరిగి ఆ కథను ఇంగ్లీషులోనే వారి సొంత తీరులో చెప్పమనండి. ఎంత మంది చెబుతారో చూడండి. ఆ కథ మీద చిన్న చిన్న ప్రశ్నలు అడగండి. ఎలా చెబుతారో చూడండి. దాదాపుగా చెప్పలేరు. తరవాత ఇదే కథను తెలుగులో చెప్పండి. కథ చెప్పటం పూర్తి అయ్యాక తిరిగి చెప్పమని అడగండి. పిల్లలు ఖచ్చితంగా చెప్పగలరు. కథ మీద ప్రశ్నలు వేయండి. ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీలు పడి మరీ బదులు చెపుతారు. అబ్బుర పరచే కొస మెలిక ఏమిటి అంటే పయి  కథ ఇంగ్లీషు మీడియంలో చదివే పదో తరగతి పిల్లల్లో నూటికి 65 మందికి అర్థం అయితే ఒట్టు. అదీ మన చదువుల డొల్లతనం.