Saturday, November 24, 2012

తెలుగు రాని వాడికి ఇంగ్లీషూ రాదు : తొలి చదువులు -20


      24-11-2012

‘‘మా  అబ్బాయి ఇంగ్లీషు మీడియం అండీ, తెలుగు రాదు’’, ‘‘మా వాడికి తెలుగు సరిగా రాదండీ, ఇంగ్లీషే బాగా చదువుతాడు’’, ‘‘మా  పిల్ల ఇంగ్లీషు చదివినంత ధారాళంగా తెలుగును చదవ లేదండి’’- ఇంగ్లీషు బడుల్లో పిల్లల్ని చదివించే ప్రతి తల్లి, తండ్రీ అనే మాటలు ఇవి. బయట కూడా ఇలాంటి మాటలు చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. వీరి మాటల్ని బట్టి ఇంగ్లీషులో చదవటం సులభం, కాగా తెలుగులో చదవటం కష్టం. అన్నీ అనుకూలంగా ఉండి, మాట్లాడటానికి ఇబ్బంది లేని సొంత భాషని చదవటం, రాయటం సరిగా రాక పోతే, దాదాపు అన్ని విషయాలలో ప్రతికూలంగా ఉండే ఇంగ్లీషు ఎలా సులభం అవుతుందీ? అన్నది అంతు పట్టని సంగతి.

ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలలో భాషా పరిజ్ఞానాన్ని పరీక్షిస్తే దాదాపు ముప్పాతిక మందికి పైగా ఇంగ్లీషులో చదవటం, రాయటం తప్ప అందు లోని తేలిక విషయాలను కూడా అర్థం చేసు కోలేరు. మరో పక్క ఈ పిల్లలు తెలుగుకూ దూరం అవుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థం అయ్యేది ఏమిటంటే, తెలుగు మాట్లాడటమే వచ్చు చదవటం రాయటం సరిగా రాదు. అలాగే ఇంగ్లీషు చదవటము రాయటం వచ్చు. అర్థం చేసు కోవటము సరిగా రాదు. ఒకవేళ ఇంగ్లీషు బాగా వచ్చిన పిల్లలకు తెలుగు కూడా బాగా వచ్చి ఉంటుంది కాబట్టి వారిలో సమస్య లేదు.

చదువులో తెలుగు కష్టం, ఇంగ్లీషు సులభం అనేది బయటకు నిజంలా అనిపించినా, తరిచి చూస్తే అది అపోహే. ఇది కేవలం నిజంలా అనిపించే ఒక భ్రమ. ఈ భ్రమల నుండి బయట పడాలి అంటే కాస్త రెండు భాషల కట్టుబడి, వాటి గుణాల గురించి కాస్త లోతు ల్లోకి వెళ్లి చూడాలి. తెలుగు సరిగా రాక పోవటానికి మొదటి కారణం భాష నేర్చు కొనే తొలి నాళ్లలో ఉండే చిక్కు.
ఆధునిక తెలుగు అక్షరమాలలో ఉన్న పొడి అక్షరాలు మొత్తం 52. ఇందులో అచ్చులు 14. అల్లులు 36. వీటిలో గుణింతాలకు పనికి రాని ఙ, ఞలనూ తీసేస్తే మిగిలినవి 34. ఈ 34 అల్లులకు గుణింతాలు కట్ట ఒచ్చు. అంటే ‘క’ అక్షరం గుణింతం వల్ల క, కా, కి, కీ... లనుండి కౌ వరకు 14 పలుకులను ఇస్తుంది. ఈ లెక్కన ఉన్న 34 హల్లులు, ఒక్కొక్కటి 14 చొప్పున 34X14=476 పలుకులు పుడతాయి. అంటే గుణింతాలవల్ల 476 పలుకులకు నేరుగా అక్షరాలు తయారు అవుతాయి.

గుణింతాల తోనే కాకుండా ఒత్తులతో కూడా మనకు పలుకులు ఏర్పడతాయి. తెలుగులో హల్లులు అన్నింటికీ వాటి వాటి ఒత్తులు ఉన్నాయి. ఏ హల్లుకు ఆ ఒత్తే వచ్చే ద్విత్త అక్షరాలు వేరు ఒత్తులతో పలికే సంయుక్త అక్షరాలను మనం ఉపయోగిస్తాం. ఒక ఒత్తు గుణింతాలవల్ల ఏర్పడిన 476 పలుకులను మళ్ళీ మార్చగలదు. ఈ లెక్కన 476 శబ్దాలను 34 ఒత్తులతో కలిసి 476 X 34=16,184 పలుకులకు అక్షరాలు ఉన్నాయి. ఇవి కాక రెండో ఒత్తుతో కూడా పలుకులు వస్తాయి. ఈ విధంగా 16,184 అక్షరాలకు రెండో ఒత్తుతో ఏర్పడే అక్షరాలు లెక్కేస్తే 16,184 X 34 = 5,50,256 పలుకులకు అక్షరాలు తయారు అవుతాయి. అంతే కాదు, అయిదున్నర లక్షల పలుకులకు పక్కన సున్నా చేరటం వల్ల వాటి ఉచ్చారణలో తేడా వస్తుంది. అలా మరో అయిదున్నర లక్షల పలుకులను రాసేందుకు అవకాశం ఉంది. అంటే అటూ ఇటూగా 11 లక్షల పలుకులకు ఏ మాత్రం తొట్రు పడకుండా నేరుగా అక్షర రూపం ఇవ్వ గలిగిన చేవ ఇప్పటి తెలుగులో ఉంది. అయితే ఇవన్నీ వాడతామా లేదా అన్నది వేరే సంగతి.

ఇంత గందరగోళంగా, గజిబిజిగా, ముళ్ళ కంపలా ఉండే భాష ఇప్పటి తెలుగు. చాలా సరళంగా, సులువుగా విన సొంపుగా ఉండే తెలుగుకు సంస్కృతాన్ని తెచ్చి కలపటటం  వల్ల నేటి తెలుగు ముళ్ళ కంపలా తయారు అయింది. దీని ముద్దు పేరు ‘ఆంధ్ర’భష. అది ఎలాగో చూద్దాం.

అసలు తెలుగు లేదా తేట తెలుగులో ఉండే అచ్చులు 
అ  ఆ
ఇ  ఈ
ఉ  ఊ
ఎ  ఏ
ఒ  ఓ   -   మొత్తం 10 అచ్చులు     

ఋ ౠ, ఐ, ఔ, అః అక్షరాలు తెలుగు కాదు. ఇవి సంస్కృతం నుండి తెచ్చి తెలుగులో పోసినవి. అలాగే తెలుగులో అల్లులు క     గ    o 
చ    జ    o 
ట    డ    ణ
త    ద    న 
ప    బ    మ
య ర ల వ స ళ ఱ-మొత్తం 20. ఖ ఘ ఙ ఛ ఝ ణ థ ధ ఫ భ శ ష తెలుగు అల్లులు కావు ఇవి కూడా సంస్కృతం నుండి తెలుగులో పోసినవే.

తెలుగు తెలుగులాగే ఉండి ఉండే పిల్లలకు తెలుగు నేర్పటం అత్యంత సుళువు. అచ్చులు హల్లులు నేర్పాక ఒక్క గుణింతం నేర్పిస్తే మొత్తం గుణింతాలు వాటంతట అవే వచ్చి 20X10 = 200 పలుకులు ఒక్క వారంలో నేర్పించ ఒచ్చు. తెలుగులో ఉన్న మరో గొప్పదనం తెలుగు పదాలలో ఏ అల్లుకు అదే ఒత్తు వస్తుంది. చాలా అరుదుగా మాత్తరమే ఇతర ఒత్తులు వస్తాయి. ఈ రావటం కూడా సంస్కృత చెలిమి వల్లే. మచ్చుకు ‘వస్తాయి’ అనే పదమే తీసుకుంటే ‘వచ్చుతాయి’ అనే పుట్టక పదం గుది గూర్చిటం వల్ల ఏర్పడింది.

తెలుగు పిల్లలకు తెలుగులో చదువు సుళువు. కానీ ఇప్పుడు మనం తెలుగు పేరుతో చెప్పే చదువు అంతా ఆంధ్ర భాషలో ఉంటుంది. ఇప్పుడు మనం తెలుగు పేరుతో చదువుతున్న ఈ చిక్కు ఆంధ్రాన్ని నేర్పించాలి అంటే టీచర్లకు చాలా ఓపిక, సమయము కావాలి.

పాతిక ఏళ్ళకు మునుపు బడిలో తొలి మూడు ఏళ్ళలో కేవలము భాషను, అంకెలను, ఎక్కాలను మాత్తరమే నేర్పించే వారు కాబట్టి ఆ రెండు ఏళ్ళలో ఆంధ్రము అయినా బాగానే నేర్చు కోగలిగే వారు. ఇప్పుడు పిల్లలకు చదివే భాష, చదివే అంశాలు, చెప్పే తీరు అన్నీ మారి పోయాక చిక్కు ‘ఆంధ్రం’ నేర్పటం తొలుత కొంత కష్టంగానే తోస్తుంది. చదవటం రాయటం నేర్చుకునే అప్పుడే మాటకు తగిన అక్షరాలను ఎన్నుకోవటంలో, అంటే అచ్చులు, హల్లులు, గుణింతాలు, ఒత్తులతో ఏర్పడే ద్విత్త అక్షరాలు, సంయుక్త అక్షరాలు నేర్చు కోవటానికి చాలా రోజులు పడుతుంది. అయినప్పటికీ ఉన్న తెలుగునే నేర్పితే ఆ తరువాత అంతా చదువు సుళువే. తెలుగును ఒక సారి పూర్తిగా నేర్చుకొన్నాక ఇక చదవటానికి, రాయటానికి జీవితాంతం కుస్తీ పడాల్సిన అవసరం ఉండదు

.
తెలుగు సరిగా రాక పోవటానికి రెండో కారణం దాన్ని సరిగా నేర్పక పోవటం. యూకేజీ నుండే మూడు భాషలు, సైన్సు, సోషలు, లెక్కలు మొదలు పెట్టటమువల్ల పిల్లలకు తెలుగు తప్ప మిగతా సబ్జక్టులు అన్నీ ముఖ్యం అయినవిగా బడి నిర్వాహకులు భావించటంతో తెలుగు నేర్పే సమయంలో కోత పడుతుంది. ఆ నేర్పేది కూడా మొక్కు బడిగా మారటం వల్ల బిడ్డలకు తెలుగు సరిగా రావటం లేదు.

తల్లిదండ్రులు కూడా తెలుగు రాక పోయినా పట్టించుకోరు. పైగా ‘‘మా వాడికి తెలుగు సరిగా రాదు’’, ‘‘మా వాడికి ఇంగ్లీషే సులభం’’ అనటం చాలా మంది తల్లిదండ్రులకు ఫ్యాషనుగా మారింది. ఇది కూడా పాఠశాల యాజమాన్యాలకు కలిసి వచ్చే అంశం. ఏ అవకాశాలు లేని ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు కష్టం కాని తెలుగు ఇంగ్లీషు మీడియం పిల్లలకు గుది బండగా మారటం వెనుక ఇంత పెద్ద తతంగం ఉంది.

No comments:

Post a Comment