Sunday, December 30, 2012

పనికిమాలుతున్న ప్రభుత్వ బడులు-తొలి చదువులు -25


30-12-2012

అశాస్ర్తియం అయినది అని తెలిసినా, ఫలితాలు రావని తెలిసినా అంతో ఇంతో ఆలోచనాపరులు కూడా ఇంగ్లీషు మీడియం వారగా మొగ్గు చూపటానికి కూడా కారణాలు చూడాల్సి ఉంటుంది. తెలుగులో చదువు చెప్పే బడులు దాదాపు ప్రభుత్వానివి లేదా ‘ఎయిడెడ్’ రంగంలోనివి. అలాంటి బడుల్లో తెలుగులో చదివే పిల్లల సాధక బాధలు, వారి విద్యా ప్రమాణాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉంది. దీనికి మనం ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. స్వయంగా ప్రభుత్వం చేయించిన సర్వేలు, వారు అధికారికంగా మద్రవేసి వదిలిన లెక్కలను పరికించి చూస్తే సరిపోతుంది.

వౌలిక సదుపాయాలకు సంబంధించిన అంత వరకు ప్రభుత్వపు బడులు లేని గ్రామాలు వేల సంఖ్యలో ఉన్నాయి. బడి ఉన్నా సరి అయిన తరగతి గదులు ఉండవు, చాలా బడుల్లో ఒక గది లోనే రెండు మూడు తరగతుల పిల్లలను కూర్చోబెట్టి చదువు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నల్ల బల్లలు, చాకుపీసులు, డస్టర్లు ఉండవు. 19 శాతం బడుల్లో అయిదు తరగతులకు కలిపి ఒకే ఒక అయ్యవారు ఉన్నారు. మంచినీరు, మరుగుడ్లు, కరెంటు సౌకర్యాల సంగతి గురించి చెప్పాల్సిన పనే లేదు.

ఇక ప్రభుత్వం బడుల్లో ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిన వివరణ ఇది.
‘‘జాతీయ స్థాయిలో జరిగిన సర్వే ఫలితాలను బట్టి చూస్తే మన రాష్ట్రంలో ఐదో తరగతి పూర్తి అయిన పిల్లల్లో కనీసం చదవటం, రాయటం, కూడికలు, తీసి వేతలు, గుణింతాలు, భాగాహారం వంటి నాలుగు రకాల ప్రక్రియలు చేయగలిగిన వారి సంఖ్య కేవలం నూటికి 40 మంది మాత్రమే. అంటే మిగిలిన 60 మంది పిల్లల పరిస్థితి ఏమిటి? ఈ పిల్లలు ఎగువ తరగతుల్లో చేరితే నేర్చుకునేది ఏమిటి? వీరు అంతా చదువులో వెనుకపడితే ఎగువ చదువుల కోసం బడుల్లో కొనసాగుతారా? ఒక వేళ కొన సాగినా చదువు మొత్తంలో ఇమడగలరా? వీరిలో మనం ఆశించిన సామర్థ్యాలను చూడలేమా? దీనికి బాధ్యులు ఎవరు? 


ఈ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాల్సి ఉంది. జాతీయ స్థాయి సర్వే ఫలితాలలోని వాస్తవికత గురించి, మన పాఠశాల ల్లోని పిల్లల విద్యా నాణ్యతను పరిశీలించడానికి ఒక ఉపాధ్యాయ బృందం ఈ మధ్య కాలం లోనే కొన్ని పాఠశాలలకు వెళ్ళింది. పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల పిల్లలను, వారి పేర్లను, వారి తల్లిదండ్రుల పేర్లను, ఉపాధ్యాయుల పేర్లను, వారికి ఇష్టమైన వాటి పేర్లను రాయ మన్నారు. అలాగే తమకు ఇష్టమయిన దాని గురించి కొన్ని వాక్యాలు రాయమన్నారు. గణితంలో సంఖ్యల గురించి, చతుర్విధ ప్రక్రియల గురించి, ఏదైనా ఒక ప్రక్రియకు చెందిన రాత లెక్క ఇచ్చి, సాధించమని కోరారు. దీని ఫలితాలు, అనుభవాలు చాలా ఘోరంగా ఉన్నాయి.

50 శాతం విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలను అర్థం చేసు కోలేక పోతున్నారు. 3వ తరగతిలో 75 శాతం విద్యార్థులు సరళ పదాలను కూడా చదవలేక పోతున్నారు. 90 శాతం విద్యార్థులు సరళ పదాలను సైతం రాయలేకపోతున్నారు. 4వ తరగతిలో 65 శాతం విద్యార్థులు సరళ పదాలను చదవలేకపోతున్నారు. 80 శాతం విద్యార్థులు సరళ పదాలను రాయలేక పోతున్నారు. 5వ తరగతిలో 53 శాతం విద్యార్థులకు సంఖ్యాభావనలపై అవగాహన లేదు. 25 శాతం విద్యార్థులకు కూడికల పట్ల అవగాహన లేదు. 85 శాతం మంది విద్యార్థులు రాత లెక్కలు చదివి అర్థం చేసుకొని చెయ్యలేక పోతున్నారు’’. ఇది చదివాక బాధ్యతగల తెలుగు వాడికి ఎవరికి అయినా నోట మాట వస్తుందా?

అర్థం కానిదీ, అబ్బురపరచే సంగతి ఏమిటి అంటే, ప్రభుత్వ బడుల్లో పనిచేసే ఉపాధ్యాయులు అందరూ నూటికి నూరుపాళ్ళు బోధనలో శిక్షణ ఇవ్వటానికి తగిట (క్వాలిఫైడ్) పొందిన వారు. దిగువ తరగతులకు డి.ఎడ్, ఎగువ తరగతులకు బి.ఎడ్ చదివినవారు. వీరు స్థాయిని బట్టి బేసిక్ చదువుకు అదనంగా పిల్లలకు చదువు చెప్పటానికి కావలసిన నేర్పులను, మెళకువలను చదివినవారు. పిల్లల సైకాలజి, బోధనా పద్ధతులు, దానిలోని మెళకువలు ఒంట పట్టించుకున్నవారు. అందులో పరీక్షలు రాసి డిగ్రీలు పొందినవారు. అంతేనా అవికాక తిరిగి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించటానికి మళ్లీ పరీక్షలు రాసిన వారు. మరి ఇంతటి తగిట ఉన్న ప్రభుత్వ అయ్యవార్లు చెప్పే చదువు ఎందుకు ఇంత నాసీ రకంగా తయారు అయిందీ?

మరోప్రక్క ప్రయివేటు బడుల్లో చదువు చెప్పే టీచర్లు నూటికి 90 నుండి 95 మంది ఏ తగిట (క్వాలిఫికేషన్) లేనివారు. ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రయివేటు బడుల్లో చదువు చెప్పేవారి చదువు తగిట పదో తరగతి. మహా అంటే ఇంటరు. కాస్త పెద్ద నగరాలలో అయితే డిగ్రి. అంతే. ఇంకా తమాషా ఏమిటి అంటే ప్రయివేటు ఇంగ్లీషు మీడియం బడుల్లో ప్రాథమిక స్థాయిలో చదువు చెప్పే టీచర్లకు ఇంగ్లీషుపట్ల అవగాహన లేదు. వీరిలో కనీసం పట్టుమని పది శాతం మంది ఇంగ్లీషు న్యూస్ పేపరులో ఒక వార్త చదివి అర్థం చేసుకోలేనివారు.

చేసేది వైద్యమే అయినా తగిట ఉన్న డాక్టరు చేసే వైద్యానికి, కాంపౌండరు చేసే వైద్యానికి స్పష్టంగా తేడా ఉంటుంది. ఇద్దరూ కట్టేది ఇళ్ళే అయినా ఇంజనీరు ప్లానుతో కట్టిన ఇంటికీ, తాపీమేస్ర్తి ఆలోచనతో కట్టిన ఇంటికి తేడా ఉంటుంది. డాక్టర్లు, ఇంజనీర్లు ఆయా రంగాలలో ప్రత్యేక శిక్షణ పొందీ, నైపుణ్యం సాధించి, ఆయా వృత్తుల్లో పని చేయటానికి తగిట సంపాదించిన వాళ్ళు. అందువల్ల వాళ్ళు చేసే పనుల్లో నాణ్యత అత్యంత ఎక్కువగా ఉంటుంది, ఉండాలి, ఉండి తీరాలి. కాని విద్యా బోధనకు వచ్చేసరికి దానికి విరుద్ధంగా ఉంటుంది. నూటికి నూరు పాళ్ళు తగిట పొందిన టీచర్లు ఉన్న ప్రభుత్వ, ఎయిడెడు బడుల్లో విద్యా ప్రమాణాలు అత్యంత దారుణంగా కొడిగట్టి ఉంటున్నాయి. ఏ తగిటా లేని వాళ్ళు, అనుభవం లేని వాళ్ళు బోధించే ప్రైవేటు బడుల్లో మట్టుకు ప్రమాణాలు ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నాయి. మనం ఎలా అర్థం చేసు కోవాలి? ఎవరిని నిందించాలి??  

Sunday, December 23, 2012

ఇంగ్లీషు నేర్చుకొనే శాస్ర్తియ పద్ధతి.... తొలి చదువులు -24

22-12-2012

‘‘పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు, పట్టనేనే బిగియ పట్టవలె...’’ అంటాడు మంది కవి వేమన. ఎవరికి అయినా తల్లి భాష ఏ ప్రయత్నమూ లేకుండా అలవోకగా వచ్చేస్తుంది. దీన్ని పనిగట్టు కొని ఎవరూ నేర్పించాల్సిన పని లేదు. సొంత భాష తప్పించి ఇతర ఏ భాషను నేర్చు కోవాలన్నా దాన్ని అది పనిగా నేర్చు కొని తీరాలసిందే తప్ప వేరే దారి ఉండదు. తన భాష కాని భాషను నేర్చు కోవాలి అంటే అది రెండు పద్ధతుల ద్వారా మట్టుకే వీలవుతుంది. మొదటి పద్ధతి ఏ భాషను నేర్చు కోతలచుకున్నారో ఆ భాషను మాట్లాడే వారి మధ్య ఉండి నేర్చు కోవటం. మచ్చుకు తమిళనాడులో ఉండి తమిళం నేర్చు కోవటం. అది చాలా సుళువు పద్ధతి. రెండో పద్ధతి తను ఉన్నచోటులోనే నేర్చు కోవాల్సిన భాషను సాధన చేయటం. అంటే మనం మన ఊరి లోనే ఉండి ఇంగ్లీషునో, హిందీనో నేర్చు కోటానికి ప్రయత్నం చేయటం. ఇది సాపేక్షంగా కొంత కష్టం అయిన పని. దీనికి ఎక్కువ సాధన చెయ్యాలి. సమయం కూడా ఎక్కువ పడుతుంది. అయితే ఈ రెండు పద్ధతుల్లోనూ ‘తెలిసిన’ భాష ద్వారా రెండో భాషను నేర్చు కోవాలి. తమిళనాడులో ఉన్నా తమిళానికి తెలుగు లింకు తెలియ చెప్పకుండా ఎన్నాళ్లు ఉన్నా తమిళం రాదు. మహా అయితే హావ భావాలు ద్వారా పొందే కొన్ని మాటలు ఒంట పట్టవచ్చు. మచ్చుకు ‘సాపాటియా?’ అని ఒక తమిళుడు నోటితో అంటూ పనిలో పనిగా నోటి దగ్గరకు తెచ్చే ఒంటి భాషను (యాక్షన్) ఉపయోగిస్తారు. అప్పుడు ‘సాపాటియా’ అనే పలుకుకి ‘తిండి తిన్నావా?’ అని తెల్లమవుతుంది. ఇక్కడ యాక్షను కూడా ఒక లింకే. అంటే మనం తమిళం నేర్చు కోవాలి అంటే అటు తమిళమూ, ఇటు తెలుగూ రెండూ తెలిసిన వారు ఉండాలి. ఇంగ్లీషు నేర్చు కోవాలి అను కొనే వారు ఓవరు అయినా దాన్ని తమ సొంత భాష ద్వారా నేర్చు కొని తీరాలిసిందే.


చిన్నపిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేకుండా అవసరాన్ని బట్టి ఎవరు ఎన్ని భాషలు అయినా నేర్చు కోవచ్చు. అయితే నేర్చు కునే చురుకుదనం పిల్లల్లో చాలా ఎక్కువ. అందువల్ల పిల్లలు చాలా వేగంగా నేర్చుకుంటారు. కానీ సౌలభ్యం మాత్రం పెద్ద పిల్లలకే ఎక్కువ. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ఇతర భాష నేర్చు కోటానికి ముందు తమ సొంత భాష పూర్తిగా వచ్చి ఉంటుంది. దాని ద్వారా రెండో భాషను నేర్చు కుంటారు. కానీ చిన్న పిల్లల్లో వాళ్ళ సొంత భాషే ఇంకా పూర్తిగా ఎదిగి ఉండదు.

నేర్చు కొనే రెండో భాష ఏది అయినా, దాన్ని నేర్చు కోవటంలో ఒక వరుస, తీరూ ఉంటుంది. అంటే భాషను అంచెలంచెలుగా నేర్చు కోవాలి. అందులో మొదటిది నేర్చు కొనే భాషను ఇతరులు మాట్లాడేటప్పుడు దాన్ని కొంత కాలం పాటు బాగా వినాలి. తరువాత కొద్ది కొద్దిగా మాట్లాడటం మొదలు పెట్టాలి. ఆపయిన చదవటం, రాయటం నేర్చు కోవాలి.

ఏ భాష అయినా నేర్చుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి దాని మీద పూర్తి పాండిత్యం రావటం అనేది మొత్తం నాలుగు అంచెలుగా జరుగుతుంది. అంటే పిల్లలు రెండో భాషను నేర్చుకోవటం మొదలుపెట్టినప్పటి నుండి పూర్తిగా దానిమీద పట్టురావడానికి ఒక దశ తరువాత మరొక దశను పూర్తిచేసుకుంటూ పోతే తప్ప నేర్చుకోవాల్సిన భాష పూర్తి కాదు.


1. పరిచయ దశ: ఈ దశ కనీసం ఒక ఏడాది పాటు ఉంటుంది. ఈ దశను వినే దశ అని కూడా అంటారు. భాష నేర్చు కునే పిల్లలు, నేర్చు కోవాల్సిన భాషలో మాటల్ని వినాలి. పదాలు పలికేటప్పుడు మాట్లాడే వారి ముఖ కవళికలు, ఒంటి కదలికలు ఎలా ఉంటున్నాయో గమనిస్తారు. అంతే కాకుండా విన్న పరాయి పదాలకు తన సొంత భాషలో అర్థాలు తెలుసు కోవాలి. ఈ దశలో పిల్లలు భాషను మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడమని ఒత్తిడి కూడా చేయ కూడదు. బిడ్డ భాషను నేర్చు కొంటున్నాడే కాని ఆ భాషను మాట్లాడే వాడు కాదని గుర్తుంచుకోవాలి. ఈ దశలో బిడ్డకు నేర్చు కోబోయే భాష మీద అవగాహన వస్తుందే తప్ప తిరిగి దాన్ని చెప్ప లేక పోవచ్చు. వాళ్ళకయి వాళ్ళు మాట్లాడితే అది వేరే సంగతి.

2. తేలిక పదాల దశ: ఈ దశలో నేర్చుకున్న పరాయి మాటలను పరిమితంగా పలకటము, సొంత భాషతో కలిపి మాట్లాడే దశ. బిడ్డలకు పదాలతో అవగాహన ఉంటుందే తప్ప పూర్తిగా భాష రాదని గుర్తుంచుకోవాలి. భాష లోని విడి పదాలను అర్థవంతంగా ఉపయోగిస్తారు. బదులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తొలుత ''Yes, No, Come, Go  లాంటి ఒంటి పలుకులతో తరువాత పొట్టిగా  ఫరాయి పలుకులను వాడ గలిగే స్థితికి  (I need, I am going, you come) ఎదుగుతారు. ఈ దశ పూర్తి కావటానికి రెండేళ్లు పడుతుంది.



3. మాట్లాడే దశ: ఈ దశలో పిల్లలు నేర్చుకొన్న భాషను సాధారణ మాట భాషగా వాడగల స్థాయికి ఎదుగుతారు. మాట్లాడే భాషలో తప్పులు చాలా తక్కువగా ఉంటాయి. మాట్లాడటానికి జంకాల్సిన అవసరం ఉండదు. పర్యాయ పదాలు నేర్చు కొని ఉంటారు కాబట్టి పదాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. చిక్కు వాక్యాలు మాట్లాడటం ఈ దశ లోనే వస్తుంది. ఈ దశ పూర్తి కావటానికి బిడ్డకు శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయుల మీద, సంస్థ మీద, చుట్టూ ఉన్న భాషా పరిసరాలను బట్టి అంటే ఆంగ్లం మాట్లాడే సహచరులు, వారితో వ్యవహరించే తీరు, సమయం మీద ఆధార పడి రెండేళ్ళ నుండి అయిదు ఏళ్ళ వరకు పట్టవచ్చు.



4. సాహిత్య దశ: ఈ దశలో దాదాపు తన సొంత భాష మీద ఎంత పట్టు ఉంటుందో అంతే పట్టు ఇంగ్లీషు మీద కూడా వస్తుంది. గ్రామరు మీద ఆధిక్యత సంపాదిస్తారు. ఇంగ్లీషులో ధారాళంగా, వేగంగా, తడబాటు లేకుండా మాట్లాడగలరు, ఇంగ్లీషులో వాదోప వాదాలు చేయగలరు. ఇంగ్లీషులో అన్నీ సాహిత్య ప్రక్రియలు చేపట్ట గలరు. తన సొంత భాషలో ప్రావీణ్యం లేని వారు ఈ దశకు చేరు కోలేరు.


విద్యకు సంబంధించిన పిల్లలకు కొత్త భాషను నేర్పించటానికి రెండు పద్ధతులు ఉన్నాయి. బిడ్డ సొంత భాషను అలాగే కొనసాగిస్తూ నేర్చు కోవాల్సిన భాషను అదనంగా చేర్చటం ‘అదనపు’ నమూనా పద్ధతి. అంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదివే పిల్లలకు మూడో తరగతిలో ఇంగ్లీషు నేర్పటం మొదలు పెట్టినట్టు. అలా కాకుండా బిడ్డ సొంత భాషలో చదవటానికి ఏ కోశానా అవకాశం లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో రెండో భాషను నేర్పించేది ‘ప్రత్యామ్నాయ’ నమూనా పద్ధతి. సాధారణంగా ఇలాంటి పద్ధతి మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్లినపుడు అక్కడ విధిలేక పాటించే పద్ధతి. రెండో భాషను బాగా నేర్చు కోవటానికి మంచి పద్ధతీ, శాస్ర్తియం అయినది అదనపు నమూనా పద్ధతి. మంచి ఇంగ్లీషు నేర్చు కోవాలంటే పద్ధతి ప్రకారం శాస్ర్తియంగా నేర్చు కోవాలి. ప్రపంచంలో ఎవరు ఇంగ్లీషు నేర్చు కున్నా అలాగే నేర్చుకుంటారు. ఇంగ్లీషు మీడియంలో చదివే మన తెలుగు పిల్లలు తప్ప

Saturday, December 15, 2012

విద్య వ్యాపారమా? సేవా??: తొలి చదువులు -23


15-12-2012


ముందు కాలంలో విద్య సేవలు అన్నీ పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండేవి. ఇందులోకి క్రమేణా ప్రయివేటు విద్యా సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. అయితే వచ్చిన ఈ విద్యా సంస్థలు సామాజిక సేవా చూపుతో వచ్చినవే. ఇందులో క్రిస్టియను మిషనరీ విద్యా సంస్థలకి చెప్పుకో తగిన పాత్ర. ఇవి మత వ్యాప్తిని ప్రచారం చేస్తున్నాయని వాటికి పోటీగా హిందూ ధార్మిక సంస్థలు విద్యా సంస్థలను నెలకొల్పాయి. వీనికి తోడు స్థానికంగా సామాజిక సేవా చూపు ఉన్నవారు కూడా విద్యా సంస్థలను మొదలు పెట్టారు. అయితే ఇవి ఏవి కూడా వ్యాపార చూపుతో నడిచేవి కావు. కాబట్టి సమాజంలో ఏ సామాజిక వర్గపు పిల్లలకు అయినా విద్యా అవకాశాలు అటూ ఇటూగా ఒకే రకంగా అందుబాటులో ఉండేవి. గత పాతికేళ్ళ ముందు వరకూ దాదాపు ఈ పరిస్థితి ఉండేది.


కాలానుగుణంగా ప్రపంచంలో చోటు చేసుకొనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక విధానాలు, వీటిని నియంత్రించే రాజకీయ వ్యవస్థల నడక తీరులు (డైనమిక్సు) మారాయి. ఈ పరిస్థితుల్లో గతంలో నేరుగా రాజ్యాలను ఆక్రమించుకొనే సామ్రజ్య వాదం తన రూపుమార్చుకొని సాంస్కృతిక సామ్రాజ్య వాదం దుప్పటి కప్పుకుంది. దీని పర్యవసానమే నేటి గ్లోబలయిజేషను.

ఈ నేపథ్యంలో గతంలో సేవగా పరిగణించేవి అన్నీ నేడు వ్యాపారం అయి కూర్చున్నాయి. ఇందులో విద్యకు మినహాయింపు ఏమీ లేదు. అందులో భాగంగా విద్య, సేవా రంగం నుండి క్రమంగా వ్యాపార రంగంగా మారింది. తొలి నాళ్ళలో చిన్న చిన్న కాన్వెంటులుగా దుకాణాలు తెరిచిన వ్యాపార విద్యా సంస్థలు సాంస్కృతిక సామ్రజ్య వాదం ఎంత వేగంగా పెరిగిందో అంతే వేగంగా, ఏపుగా పెరిగి నేటి కార్పొరేటు బడుల రూపం మన ముందు ఉన్నాయి.


సాంస్కృతిక సామ్రాజ్యవాదం ప్రధాన అజెండా ఆయా సమాజాల భాషను, సంస్కృతిని చంపి, వాటి చోటులో మార్కెట్టు సంస్కృతిని, ఇంగ్లీషు భాషను నాటటం. విద్య ద్వారా మానసిక దాసోహాన్ని నింపటం. ఆ పని చేసి పెట్టటానికి వీలుగా మన ముందు ఉన్నవే కార్పొరేటు బడులూ, అందులో ఇంగ్లీషు మీడియం.


ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పే బడులు దాదాపుగా ప్రయివేటు రంగంలో నడిచేవే. చాలా తక్కువగా సర్కారు బడులు ఉంటాయి. సర్కారు బడులు ఉన్నా వాటిలో పిల్లలు చెల్లించే బోధనా రుసుం మామూలుగా సర్కారు బడుల్లో ఉన్నట్టే ఉంటుంది. ప్రయివేటు బడుల్లో చదువు చెప్పినందుకు ప్రతి ఫలంగా ఫీజు వసూలు చేస్తారు. అంటే రుసుము చెల్లింపునకు సమానం అయిన సేవను అందించటం. ఇక్కడ విద్యార్థి (పరోక్షంగా తల్లిదండ్రులు) వినియోగదారుడు కాగా పాఠశాల యాజమాన్య సర్వీసు ప్రొవైడరు. తీసుకున్న డబ్బుకు సమానం అయిన సేవలు అందించక పోతే వినియోగదారుడు ఒప్పుకోడు. అటువంటిది ఏమయినా జరిగితే ఈ వినియోగదారుడు మరో బడిని వెతుక్కుంటాడు. కాబట్టి వసూలు చేసే ఫీజును బట్టి అదనపు సేవలు అందించాలి. అందులో భాగంగానే బోధనలో శ్రద్ధ, చదివించటంలో వ్యక్తిగత పర్యవేక్షణ ఉంటాయి. బోధించే సమయంలో ఉపకరణాలు వాడటం, పిల్లలచేత పదే పదే ప్రాక్టీసు చేయించటం వీరు అందించే అదనపు సేవలు అంటే పిల్లలు ఏదో ఒక రకంగా నేర్చుకునేంత వరకు మళ్లీ మళ్లీ అదే పని చేయించటం. బట్టీ పెట్టించటం, ఇంపోజిషను రాయించడం లాంటివి ఏడాదిపొడవునా చేయిస్తుంటారు. హోం వర్కుల పేర ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా పిల్లల చేత మళ్లీ అదే పని చేయిస్తూ ఉంటారు.


పిల్లలు పడే ఇలాంటి కఠోర శ్రమ వల్ల పుస్తకాలలో ఉన్న వాక్యాలు అలాగే మెడులోకి వెళ్లి, పరీక్షల సమయంలో తిరిగి పేపరు మీదకు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు కట్టిన ఫీజు మార్కుల రూపంలో ప్రోగ్రెసు కార్డు మీద కనపడుతుంది. అది తమ బిడ్డల ప్రతిభలా కనపడే సరికి మురిసి పోతారు. కానీ దాదాపు 80 శాతం అవి ఇవి నిజమయిన ప్రమాణాలు కావు. పరీక్షలకు తగ్గట్టు పిల్లల్ని రుబ్బించటం వల్ల తెలివితో సంబంధం లేకుండా వచ్చే మార్కులు అవి.


కార్పోరేటు బడులను చూడండి! తొమ్మిదో తరగతి పరీక్షలు కాకుండానే పదో తరగతి సిలబసు మొదలు పెట్టటము, వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహించటం వల్ల ఫిబ్రవరికి పూర్తి కావాల్సిన సిలబసు అక్టోబరుకే పూర్తి చేస్తారు, మళ్లీ ‘రివిజన్’ పేరుతో వేద మంత్రాలకు మల్లే ప్రశ్నలకు సమాధానాలను రుబ్బించటం మొదలు అవుతుంది. ఆ సమయమూ చాలక బడి అయిపోయాకకూడా ‘స్టడీ అవర్సు’ పేరులో రాత్రి ఏడు ఎనిమిది వరకూ పిల్లల్ని వదలరు. నిజానికి పుస్తకాలలో ఉన్న అంశాలను పిల్లల బుర్రల్లోకి ఎక్కించటానికి అంత సమయం అవసరమా? అశాస్ర్తియ పద్ధతులు పాటిస్తున్నారు కాబట్టే అంత సమయం పడుతుంది. నిజం మార్కులా ఉత్తుత్తి మార్కులా అనేదాంతో సంబంధం లేకుండా ఎలాంటి పద్ధతులు పాటించి అయినా ఎక్కువ మార్కులు రావటమే తెలివికి కొలబద్దగా పరిగణించటమే ఇప్పుడు కొనసాగుతున్న పద్ధతి. అందుకు వారి దగ్గర ఉన్న ఒకే ఒక, గత్యంతరం లేని దారి ‘బట్టి’ పద్ధతి.


చదువు అర్థం కాక పోయినా, బుర్ర ఎదగక పోయినా మార్కులు రాగల అనేక పద్ధతుల్లో ‘బట్టి’ది ముఖ్య పాత్ర. కాబట్టి మార్కుల కోసం బట్టీ పద్ధతి ఇంగ్లీషు బడుల్లో అలవాటు చేస్తారు. విద్యా వ్యవస్థలో బట్టీ పద్ధతి ఎంత సంస్థాగతం అయింది అంటే పాతిక ఏళ్ళలో మొత్తం పరీక్షా విధానమే బట్టికి అనుకూలం అయిన పరీక్షా విధానంగా  రూపు దిద్దుకొని ఇప్పుడు అమలు అవుతుంది. పరీక్షల్లో మార్కులు రాబట్టటం కోసం ఎలాంటి పద్ధతుల్లో బోధించాలో అలాంటి పద్ధతుల్లోనే బోధిస్తారు. అలానే పరీక్షలు రాయిస్తారు. అలా బిడ్డల్ని తెలివిగలవారిగా చూపెడతారు. ఈ రకంగా బిడ్డల బుల్రు ఎదగక పోయినా ఎదుగుతుందని నమ్మించే విధంగా బురిడీ కొట్టిస్తారు. ఎగువ క్లాసులకు వచ్చి బొక్క బోర్లాపడే దాకా ఆ సంగతిని తల్లిదండ్రులకు తెలియను గాక తెలియనివ్వరు. 

వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాపం! నిజం మార్కులు వేస్తే తల్లిదండ్రులు అరిగించుకోలేరు. బిడ్డ పరిమితిని గుర్తించటం మాని టీచర్లను బాధ్యులుగా చేసి బడి మారిస్తే ఆ వచ్చే ఫీజు పోతుంది కదా! కాబట్టి బిడ్డ చదువును అరచేతిలో వయికుంఠం చూపినట్టు ఎదుగుదల అట్ట (ప్రోగ్రసు కార్డు) లో మార్కులు ‘ఎగేసి’ చూపిస్తారు. అవగాహన లేని తల్లిదండ్రులకు బిడ్డల మార్కులే కొలబద్ద. అవి ఎలా వస్తున్నాయి అనే సంగతి మీద చూపు నిలుపరు.


ప్రయివేటు బడుల్లో ప్రత్యేకించి ఇంగ్లీషు బడుల్లో చదివే పిల్లల ప్రోగ్రసు రిపోర్టులు చూస్తే అసలు ఫెయిలు అయ్యేవారే ఉండరు. సరి కదా! ముందు చెప్పినట్టు మార్కులు బాగా ‘తెప్పించి’ ఉంటారు. కాబట్టి మీ పిల్లలు ‘నిజ్జం’ ప్రతిభ ఉన్నవారా లేక ‘చూపెట్టిన’ ప్రతిభ కలవారా అనేది చూసుకోక పోతే ఆ తరువాత ఒక్కసారిగా బొక్క బోర్లా పడక తప్పదు.


విద్యా విధానంలో శాస్ర్తియ పద్ధతి లోపించినప్పుడు అశాస్ర్తియ పద్ధతి రాజ్యం ఏలుతుంది. అంటే అడ్డ దారుల్లోకి విద్యా విధానం కొట్టుకు పోతుంది. మన చెడు రాత ఏమిటంటే ఆ అడ్డ దారుల్లో ఉన్న దాన్ని సరి చేసి గాడిలో పెట్టు కోవాల్సింది పోయి అదే సరి అయినది అని ఒకరిని చూసి ఒకరు అనుకరిస్తూ అందరూ మూకుమ్మడిగా ఆ వయిపే నడుస్తున్నాం.


ఎప్పుడో చదవబోయే వృత్తి విద్యల వయిపు చూపు సారించి, పసితనం నుంచే పిల్లల జీవితాలతో ఆట మొదలు పెడుతున్నాం. ఊరిస్తున్న ఆదాయ మార్గాలు అయిన ‘కార్పోరేటు ఉద్యోగాలు’, ‘విదేశీ అవకాశాలు’, ‘సాఫ్టువేరు ఉద్యోగాల’ కోసం పిల్లల్ని బలిపీఠం మీదకు ఎక్కించాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాం. అందుకు తగ్గట్టు ఫీజు తీసుకొని బలిపీఠం మీదకు ఎక్కించేవే ఇంగ్లీషు మీడియం బడులు.


బోధనా ప్రమాణాలలో ఏ మాత్రం తేడా చూపకుండా బిడ్డల సొంత భాషలో చదువు చెప్పిన పిల్లలకు, అదే విద్యను పరాయి భాషలో చదువు చెప్పిన పిల్లలతో పోలిస్తే పరాయి భాషలో చదివిన పిల్లలు ఖచ్చితంగా వెనుకబడి ఉంటారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రతీ పరిశోధనలోనూ నిగ్గుతేల్చిన సత్యం ఇది. ప్రాథమిక స్థాయిలో ప్రయివేటు బడుల్లో అదే ప్రమాణాలతో సొంత భాషలో చదువు చెబితే పిల్లల్లో దాగి ఉన్న మొత్తం సామర్థ్యాన్ని వెలికితీయవచ్చు. సొంత భాషలో చదివిన పిల్లలు చదువులో మెరుగ్గా రాణించటమే కాకుం డా మాటకారితనం (కమ్యూనికేటివ్ స్కిల్స్), భావ ప్రకటన తోపాటు వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది. ఈ పునాది పయిన ఎన్ని భాషలు అయినా అవలీలగా నేర్చుకుంటారు.

Sunday, December 9, 2012

ఇంగ్లీషు మీడియం చిదంబర రహస్యం - తొలి చదువులు -22

8-12-2012
                                                 www.andhrabhoomi.net/content/early-studies-2

గతంలో లేని విధంగా నేడు జనం తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల నుండి ప్రయివేటు బడులు వైపు, తెలుగు మీడియం నుండి ఇంగ్లీషు మీడియం వైపు మొగ్గు చూపటానికి గల కారణాలను వెతకాల్సి ఉంటుంది. దీనికి జనం అనుకొనేది ఏమిటి అంటే ప్రభుత్వ బడుల్లో చదువు సరిగా చెప్పరు అనీ, తెలుగులో చదివిన వారికంటే ఇంగ్లీషు మీడియం చదివిన పిల్లల విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అని.

నిజానికి ఇది కేవలం పైపైన కనిపించే మెరుగు మాత్రమే. దాని లోతుల్లోకి తొంగి చూస్తే ఈ అనిపింపు ఉత్త డొల్లే. లేనివి ఉన్నట్టు అనిపించే మాయ మాత్రమే. ప్రయివేటు బడుల్లో ప్రమాణాలు పెరిగినట్టు అనిపించ టానికి కారణం వారు ఇంగ్లీషు మీడియంలో చదవటం కాదు. అందుకు బయటకు కనిపించని కారణాలు వేరే ఉన్నాయి. అవి ఏమిటో కాస్త లోతుల్లోకి వెళ్లి పరిశీలిస్తే తప్ప ఇంగ్లీషు మీడియం దౌర్భాగ్యం నుండి మనం బయట పడలేము.

సాధారణంగా అందరూ అనుకొనేది ఏమిటి అంటే పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేది కేవలం పాఠశాలో, బోధనా భాషో అనుకుంటారు. అంతకంటే పొరపాటు మరొకటి లేదు. నిజానికి పిల్లల ప్రతిభ బయటకు రావటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి.


ఇందులో మొదటిది విద్యార్థిలో ఇమిడి ఉండే చేవ. అంటే పిల్లలకు పుట్టుకతో వచ్చే తెలివి సామర్థ్యం, వారిలో ఉండే కల్పానికత (క్రియేటివిటీ), చురుకుదనం లేదా ఉత్సాహం, నేర్చుకునే తత్వం మొదలయినవి. రెండో అంశం కుటుంబం. అంటే తల్లిదండ్రులు విద్యా స్థాయి, చదువు పట్ల వారు చూపే మార్గదర్శకత్వం, పిల్లలపట్ల తీసుకునే జాగర్తలు, చదువుకోసం వారు కల్పించే వసతులు. అంటే పిల్లలకు కల్పించే మవులిక సదుపాయాలు. ఈ రెండింటి మీద ఆధారపడి మూడోది అయిన పాఠశాల విద్య ఉంటుంది. అంటే బోధనా మాధ్యమం, బోధించే పద్ధతులు, బోధనా ప్రణాళిక, ఉపాధ్యాయుల బోధనా తీరులు మొదలయినవి.

ఒక పాఠశాలలో చదివే పిల్లలు అందరికీ బోధనా మాధ్యమం, బోధించే పద్ధతులూ, ప్రణాళిక, పాఠం చెప్పే ఉపాధ్యాయుడు, వారు పాఠం చెప్పే తీరూ ఒకే రకంగా ఉంటుంది. ఇవి విద్యార్థికీ విద్యార్థికీ మారవు. అయినప్పటికీ, పిల్లలు అందరూ ఒకే స్థాయిలో ప్రతిభను చూపలేకపోతున్నారు అంటే అర్థం మిగతా రెండు కారణాలలోనే తేడా ఉండి తీరాలి. అవే తొలి రెండు కారణాలు అయిన విద్యార్థి సొంత సామర్థ్యం, వారి తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యం. పిల్లవాడి చేవ, వారి తల్లిదండ్రులు అందించే మవులిక తోడ్పాటు పిల్లలు రాణించటానికి కారణం అనేది బయటకు కనిపించదు. ఇవి తెర వెనుక వాటి పాత్రను పోషిస్తాయి. కేవలం పాఠశాల స్థాయివల్లే బిడ్డకు ప్రతిభ అబ్బదు. ప్రతిభను వెలికి తీయటంలో పాఠశాల కూడా తన పాత్రను సరిగా పోషించాలి. కార్పోరేటు బడిలో చదివినంత మాత్రాన పిల్లల్లో ప్రతిభ వెలికిరాదు. ప్రభుత్వ బడిలో చదివిన వారికి ప్రతిభ లేకుండా పోదు. ‘‘విద్యార్థి - కుటుంబం - బడి’’ ఈ మూడు పరస్పర కదలికల (డైనమిక్సు)వల్లే పిల్లల్లో ప్రతిభ తన్నుకొని వస్తుంది.

బాగా చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించటం, హోం వర్కులు చేయించటం, అర్థం కాని వాటిని అర్థం అయ్యేటట్టు విశదీకరించటం లాంటివి చేస్తారు. పిల్లల ఆసక్తి, అభిరుచులను గమనించి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం పిల్లల్ని ప్రభావితం చేస్తాయి. అంతేకాక పిల్లల మానసిక ఎదుగుదలకు అవసరం అయిన చదువేతర విజ్ఞానాన్ని అందించటంలో చదువుకొన్న తల్లిదండ్రులు ముందు ఉంటున్నారు. ఈ కారణాలవల్ల వాళ్ళ పిల్లలు బోధనా భాషతో సంబంధం లేకుండా స్వతహాగా రాణించటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి.

ఆర్థికంగా బాగా ఉన్నా, తల్లిదండ్రులు విద్యావంతులు కానప్పుడు, వారిపిల్లలు చదవుల్లో అంతగా రాణించటం లేదు అన్న నిజాన్ని కూడా గమనించాలి. వారు ధనవంతులు అయినప్పటికీ చదువుకోని తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చదువు విషయంలో దారిచూపించలేరు. అయినప్పటికి వారి స్థాయికి తగ్గట్టు పిల్లలకు ట్యూషన్లు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ట్యూషన్లలో చెప్పేది బడిలో చెప్పే చదువుకు కొన సాగింపుగానే ఉంటుంది తప్ప విద్యావంతులు అయిన తల్లి దండ్రులు తీసుకొనే శ్రద్ధకు సాటి రాదు. అందు వల్లే ధనిక వర్గానికి చెందిన పిల్లలు కూడా చదువు లోకి వచ్చేసరికి మూడో వంతు పిల్లల వర్గం లోకి చేరు తున్నారు.

చదువు రాని తల్లి దండ్రులు అంతో ఇంతో చదువుకున్న పేద, దిగువ మధ్య తరగతి తల్లి దండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించు కోవాలి అని తాహతుకు మించి స్కూళ్ళు అనబడే కార్పోరేటు బడుల్లో చేర్పిస్తున్నారు. కాని విద్యా వంతుల మాదిరి తమ బిడ్డలను ‘గైడ్’ చేయలేక పోతున్నారు. ఎంతో కొంత చదువుకున్నవాళ్ళు ఒకటి రెండు తరగతుల్లో కొంత చెప్ప గలిగినా ఆ తరువాత ఇంగ్లీషులో వాళ్ళ స్థాయి చాలదు కాబట్టి బిడ్డలకు బడిలో చెప్పిందే చదువు. బిడ్డ చదువులో రాణించటం లేదని ట్యూషన్లు ఏర్పాటు చేసినా ముందు చెప్పినట్లు అది బడి విద్యకు కొనసాగింపే కాని విద్యావంతులు అయిన తల్లి దండ్రులు తీసుకొనే శ్రద్ధకు ప్రత్యామ్నాయం కాదు.

ఈ కారణాల వల్ల ఇంగ్లీషు మీడియంలో చదివే పేద, దిగువ మధ్య తరగతి వర్గాల పిల్లలు చదువు కోని తల్లి దండ్రులు ఉన్న పిల్లలకు పాఠశాలలో చెప్పేది అర్థం కాక, ఇంట్లో చెప్పే వాళ్ళు లేక పోవటంతో వీళ్ళకు చదువు మొక్కుబడి తంతుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పిల్లలు స్వతహాగా తెలివిగల పిల్లలు అయితే ఆ తెలివిని అంతా బట్టీ పెట్టటానికి ఉపయోగించి ఎలాగో ఒకలా నెట్టు కొస్తారు. కానీ ఇంగ్లీషు మట్టుకు సరిగా ఒంట పట్టదు. బట్టీ పట్టటానికి కూడా సామర్థ్యం లేని పిల్లలు బడి అంటే విముఖత ఏర్పడి పక్కదార్లు పడుతారు లేదా చదువుకు నాగా పెట్టేస్తారు.


దిగువ మధ్య తరగతి, లేదా పేద ప్రజానీకం నివసించే ప్రాంతాలలో ఉన్న ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో కేజీ క్లాసుల్లో చేరిన పిల్లల్లో ఎంతమంది పదో తరగతి వరకూ వస్తారో గమనిస్తే ఆ సంగతి అట్టే తెల్లం అవుతుంది. ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో ఇప్పుడు జరుగుతున్న తంతు ఇదే. అయితే అవేమీ బయటకు కనపడవు. మనకు కన పడేదల్లా ఎంసెట్టు, ఐ.ఐ.టిలలో ర్యాంకులు తెచ్చిన పిల్లలే. వీరు వందలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరిని చూపించి మిగతా పిల్లలకు వాతలు పెడుతుంటారు. 

Monday, December 3, 2012

ఇంగ్లీషు అంత ‘వీజీ’ కాదు! : తొలి చదువులు -21


1-12-2012

ఏ బీ సీ డీ లతో మొదలు అయ్యే ఇంగ్లీషు నేర్చుకునే తొలి నాళ్లలో  చాలా  సుళువు అనిపిస్తుంది. లోతుల్లోకి వెళ్లే కొద్దీ దాని తడాఖా ఏమిటో తెలుస్తుంది. ఇంగ్లీషు బయటకు కనిపించే అంత సుళువు అయిన భాషేమీ కాదు. ఇంగ్లీషు భాషా వేత్తలకు సైతం తలనొప్పి మాత్రలను మింగించే అంత చిక్కు (కాంప్లెక్సు) నుడి. ఇంగ్లీషు భాషలో ఉద్దండ పండితులు కూడా ఈ భాషలో తప్పులు దొర్లకుండా రాయ లేరు. చదవ లేరు, మాట్లాడ లేరు. ఇంగ్లీషు సొంత భాషగా ఉన్న ఆంగ్లేయులకు సైతం చదవటానికీ రాయటానికి వచ్చేసరికి వాళ్లకూ ఇది నొప్పే. వాళ్లు కూడా ఉచ్ఛారణలూ, స్పెల్లింగులూ ఎప్పటికి అప్పుడు నేర్చుకుంటూ ఉండాల్సిందే. ఆ భాష కట్టుబడి తీరే అంత. ఆంగ్ల అక్షర మాల (ఆల్ఫాబెట్)లో తక్కువ అక్షరాలుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇతర ప్రపంచ భాషలనుండి వచ్చి చేరే పదాలకు తగ్గట్టు రాతను, ఉచ్ఛారణ ఇవ్వలేక పోవడమే ఈ తిప్పలకు కారణం.

చిన్న పిల్లలకు ఇంగ్లీషు సులభంగా ఉన్నట్టు అనిపించడానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి. ఒకటి తెలుగుతో పోలిస్తే అక్షరాల సంఖ్య తక్కువ. అదీ కాక అక్షరాలు దాదాపుగా నిలువు, అడ్డ, వాలు గీతలతో ఉంటాయి. పిల్లలకు గీతలతో ఉండే ఆంగ్ల అక్షరాలు రాయడం చాలా సుళువు.

రెండో కారణం బోధనలో చూపే శ్రద్ధ, నేర్పించే తీరు. పిల్లల్ని బడిలో వేసిన మొదటి రోజు నుండే ‘ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్..’ అని కానీ, లేదా ‘ఏ పి పి ఎల్ ఈ-యాపిల్’ ‘ బి ఏ టి- బ్యాట్’ ‘సి ఏ టి- క్యాట్’ అంటూ ఆంగ్ల పదాలను స్పెల్లింగులతో సహా నేర్పిస్తుంటారు. ఆ విధంగా స్కూల్లో వేసిన నాటి నుంచి పదాలను స్పెల్లింగులతో సహా బట్టీ పట్టడం అలవాటు చేస్తారు. ఆదిలో చిన్న చిన్న పదాలు, తక్కువ పదాలు ఉంటాయి కాబట్టి సులువు అనిపించిన ఇంగ్లీషు రాను రాను గుదిబండగా మారడానికి కారణం ఏమిటో కాస్త లోతుల్లోకి వెళ్లి చూస్తే కానీ అర్ధం కాదు.


ఆంగ్లంలో మొత్తం అక్షరాలు 26. వీటిలో A E I O U అనేవి అచ్చులు మిగతా 21 హల్లులు. ఈ 21 హల్లులు వాటంతట అవి పలకలేవు. వీటికి అచ్చులు తోడు అయితేనే పలకగలవు. మచ్చుకు K అక్షరం ‘క్’ అనే మూల పలుకును ఇస్తుంది. దీని పక్కన A చేరినప్పుడు అది ‘క’ అనీ, O చేరినప్పుడు ‘కొ’ అనే ఇస్తుంది. అయితే K పక్కన O చేరిన ప్రతిసారి ‘కొ’ పలకాలనే ఖచ్చితమైన నిబంధన ఏమీ లేదు. మచ్చుకు COLLEGE అనే పదంలో COని ‘కా‘లేజ్‌గా పలకాలి. అదే COని COMAలో ‘కో’మగా పలకాలి. ఈ విధంగా CO అనే రెండు అక్షరాలు ఆయా సందర్భాలకు తగ్గట్టు ‘కొ’, ‘కో’, ‘క’, ‘కా’లుగా పలకాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా హల్లులకు అచ్చులు కలిపి చదవడంలో ఈ పితలాటకం తప్పదు. దేన్ని ఎప్పుడు ఎలా పలకాలి అనేది ఆ పదాన్ని నేర్చు కునేటప్పుడే తెలుసుకోవాలి. ఇందుకు నిరంతర సాధన కావాలి. ఇంగ్లీషులో దీనికి ‘ఫొ నిటిక్స్’ అనే పెద్ద  శాస్త్రమే  ఉంది.


నుడి నియమాల  ప్రకారం 21 హల్లులు 21 మూల శబ్దాలనే పలుకుతాయి. వీటికి అచ్చుల్ని కూడా కలిపితే మొత్తం 26 మూల శబ్దాలే పలకటానికి వీలు అవుతుంది. కానీ మనిషి చాలా శబ్దాలు చేయగలడు. వాటి అన్నింటికి అక్షర రూపం ఇవ్వాలంటే ఉన్న ఈ 26 మూల శబ్దాలు చాలవు. కాబట్టి అవసరాల రీత్యా ఒక అక్షరాన్ని ఒక శబ్దం కంటే ఎక్కువ శబ్దాల కోసం వాడుకోవాలి. సరిగ్గా ఇక్కడినుండే ఇంగ్లీషుతో పితలాటకం మొదలు అవుతుంది. దీనికి ఎన్ని నియమాలు పాటించినా పలుకు తీరులో, రాత తీరులో తికమక తప్పదు.


21 హల్లులకు కలిపితే 21 పలుకులు పుడతాయి. ఇలాగే, ఉన్న 21 హల్లులకు ఐదు అచ్చులు కలిస్తే 21 X 5 =105 పలుకులు ఏర్పడతాయి. ఇంగ్లీషులో రెండు అక్షరాల తర్వాత అచ్చు వచ్చే సాంప్రదాయం కూడా ఉంది. అంటే CAT..లో C తరువాత రావడం వల్ల ‘కా’ అయినట్టే CLASS అనే పదంలో CL తరువాత రావడంవల్ల ‘క్లా’గా పలుకుతారు. అంటే ఇవి మన ద్విత్త అక్షరాలూ, సంయుక్త అక్షరాలు లాంటివి. ఈ రకంగా 105 శబ్దాలకు మరో మారు 26 అక్షరాలు వచ్చి చేరాయి అనుకున్నా అచ్చులవల్ల 105 X 26 = 2730 పలుకులు రావటానికి అవకాశం ఉంది. ఇంకా నియమాలు లేకుండా ఏర్పడే పలుకులను కూడా పరిగణనలోకి తీసుకుంటే 3వేలు దాటక పోవచ్చు. కానీ ఇంగ్లీషులో ఉన్న ఈ 26 అక్షరాల తోనే ప్రపంచంలో మానవుడు చేయ గలిగిన అన్ని పలుకులకు అక్షర రూపం ఇవ్వాలి.


ఇంగ్లీషులో అక్షరాలు లేవని మనిషి శబ్దం చేయ కుండా ఉండలేడు. మనిషి చేయ గలిగిన అన్ని శబ్దాలకు 26 అక్షరాల తోనే రాయాలి, చదవాలి. అందు వల్ల వీటికి ఎన్ని నియమాలు, నిబంధనలు వర్తింప చేసుకున్నా అందరు ఒకే రకంగా చదివి, రాయ గలిగే విధంగా అక్షర రూపం ఇవ్వడం వీలు కాదు. అందుకే ఏ ఇద్దరు ఒక రకంగా చదవ లేరు, పలక లేరు. గతంలో కడప స్పెల్లింగ్ cuddapah గా ఉన్నప్పుడు ఇంగ్లీషు వార్తలు చదివే వాళ్లు ‘కుడప’, ‘కుడ్డప్’, ‘కడ్డప్’, ‘కుడపహ్’ అని రక రకాలుగా చదువుతుంటే మనకి తమాషాగా ఉండేది. ఇంగ్లీషు వాళ్లు గోదావరిని ‘గోడావరి’ అనీ, గుంతకల్లుని ‘గుంకల్’ అనీ, అనంతపురాన్ని ‘అనంపురం’ అని పలికేవాళ్లు. కారణం తెలిసిందే. ఇంగ్లీషులో ‘ద,డ’లకు D I, ‘త,ట’లకు T I వాడడం వల్ల స్థానికంగా ఆ పదంతో పరిచయం లేక పోతే ఎవరికి తోచినట్టు పలుకుతారు.



మొదట్లో సులభం అయిన ఇంగ్లీషు రాను రాను స్పెల్లింగులు, ఉచ్ఛా రణ, గ్రామరుతో పిల్లల కష్టాలు మొదలవుతాయి. తెలుగులో అయితే ఒక గుణింతం నేర్చుకోగానే మిగతా గుణింతాలు కొద్దిపాటి ప్రయత్నంతో వాటంతట అవే వస్తాయి. ఇంగ్లీషులో ఆ పప్పులు ఉడకవు. p-u-t ‘పుట్’ అయినప్పుడు b-u-t ‘బుట్’ కావాలనే రూలేం ఉండదు. దాన్ని ‘బట్’ అనాల్సిందే. ఈ విధంగా ప్రతి పదానికి స్పెల్లింగు, అర్ధం, వాక్య నిర్మాణం, గ్రామరు అన్నీ కలిసి ఓ పెద్ద సుడి గుండంలా తయారవుతుంది.


అక్షరాలు పూర్తిగా రానిదే చదవడమూ, రాయడమూ చేయలేరు. కాబట్టి పుస్తకాలలో ఉన్న దాన్ని చదవాలన్నా, చదివిన దాన్ని తిరిగి రాయాలన్నా అక్షరాలు నేర్చుకోవాలి. సొంత భాషలో చదివే పిల్లలు అయితే చదవడం, రాయడం నేర్చుకుంటే చాలు. మిగతా చదువు అంతా దాని ద్వారా జరిగి పోతుంది. అది పనిగా భాష నేర్చు కోవాల్సిన పని లేదు. ఇతర భాషలో చదవాలి అంటే, ఆ భాషను ముందుగా నేర్చు కోవాలి. పరాయి భాషలో చదవటమూ, రాయడం నేర్చు కోవడం పెద్ద పని ఏమీ కాదు. మచ్చుకు తమిళ అక్షర మాలను, గుణింతాలను పది రోజుల్లో నేర్చుకో ఒచ్చు. అప్పటి నుండి ఆ భాషలో చదవడము, రాయడం చేయ గలము. కానీ ఆ భాషలో మనం మాట్లాడ లేము. అవతలి వారు మాట్లాడితే మనకు అర్ధం కాదు. చదవడం, రాయడం వచ్చినంతనే పూర్తి భాష వచ్చినట్టు కాదు.ఈ సంగతి తెలియకే తల్లిదండ్రులు మా పిల్లలకు ఇంగ్లీషు సులభం అనే పయిపయి గమనింపును చెప్పేది.


ఇంగ్లీషు మీడియంలో చదివే పిల్లలకు ఎక్కువ భాగం ఆ భాషను చదవడము, రాయడమో వచ్చు. మొత్తం భాష మీద పట్టు రాక పోవడానికి కారణం పిల్లలకు సొంత భాషే ఎరగని వయసులో రాని భాషలో బోధించడం, తెలుగు ద్వారా నేర్పాల్సిన ఇంగ్లీషును, రాని ఇంగ్లీషు ద్వారానే నేర్పించడం వల్ల భాష పెరుగుదలకు గండి పడుతుంది. మొత్తం మీద అటు ఇంగ్లీషు సరిగా రాక, ఇటు సొంత భాషా సరిగా రాక పిల్లలు రెంటికి చెడుతున్నారు.