Tuesday, February 19, 2013

దళిత పిల్లలకు ఇంగ్లిషు మీడియం న్యాయం చేస్తుందా?: తొలి చదువులు-32


పిల్లల చదువులో బోధనా భాషగా సొంత భాషను వాడాలా లేక ఇంగ్లీషును వాడాలా అనే దానిమీద వాదనలు, ప్రతివాదనలు చాలా కాలంగా జరుగుతున్నవే. తల్లి నుడిలోనే చదువు ఉండాలని ఒక వర్గం అంటుండగా, అక్కర్లేదు, మారుతున్న సామాజిక పరిస్థితుల్లో, అవసరాలకు తగ్గట్టు ఇంగ్లీషు మీడియంలో బోధన జరగాలని మరో వర్గం వాదిస్తుంది. భాషను కాపాడు కోవడం, స్వావలంబన, సంస్కృతి, మేథాతనం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలు మొదటి వర్గానికి వాదనా వస్తువులు కాగా, ఉపాధి అవకాశాలు, మార్కెటింగు, గ్లోబలయిజేషను, ఆర్థిక అసమానతలు, కుల వివక్షత బాణాలు రెండో వర్గపు అమ్ముల పొదిలో ఉంటున్నాయి.

నిజం ఏమిటో తెలుసు కోవాలి అంటే ఆ అంశం మీద పరిశోధన జరగాలి. పరిశోధనల్లో తేలిన నిజం అనుభవంలో మరింత రుజువు అవుతుంది. సైన్సులో ‘నిజా’నికి ‘అభిప్రాయా’నికి మధ్య కచ్చితమయిన విభజన రేఖ ఉంటుంది. ఇక్కడ నిజం తెలియనంత వరకే అభిప్రాయానికి విలువ. ‘ఇదీ నిజం’ అని నిగ్గు తేలాక ఇక దాని మీద వాదనలు - తిరుగు వాదనలకు తావు ఉండదు. తెల్లటి కాంతిలో ఏడు రంగులు ఉంటాయి అనేది ప్రయోగ పూర్వకంగా తేల్చిన సత్యం. దీని మీద అభిప్రాయాలకు తావు లేదు.

శాస్ర్తియ అంశాలను ప్రస్తావించేటప్పుడు సాధారణ అంశాలను పరిశీలించినట్టు పై పైన తడిమితే సరి పోదు. తొలుత ప్రాథమిక పరిశీలన, ఆ తరువాత కొంత లోతు అవగాహనకు పోతూ పరిశోధనను తటస్థ దృష్టితో సాగించాలి. అప్పుడు కాని నిజం తేలదు. ముందుగా ఏర్పరచుకున్న ఇరుకు మనసుతో పరిశోధన మొదలు పెడితే ఆ పరిశోధన అంతా మనసులో ఉండే నమ్మకానికి అనుకూలంగా కట్టడి చేయడం మొదలవుతుంది. అప్పుడు వచ్చే ఫలితం నిజానికి దగ్గరగా ఉండ వచ్చు, ఉండక పోవచ్చు. కారణం ఏమిటి అంటే నిజం వేరు, నమ్మకం వేరు. నిజం నమ్మకంగా ఉండవచ్చు కానీ నమ్మకం నిజం కావాలని ఏమీ లేదు.

విద్యా విధానంపట్ల ప్రత్యేకించి బిడ్డలకు పునాదులు వేసే తొలి చదువుల్లో ఏ అంశాలను బోధించాలి అనే దాని పట్ల ఎవరి అభిప్రాయాలు వారికి ఉండ వచ్చు. ఇది ప్రాంతానికీ ప్రాంతానికీ, జాతికి జాతికీ మారుతూ ఉంటాయి. కానీ ఆ విద్యను పిల్లల్లో చొప్పించ టానికి ఉపయోగించే బోధనా ‘పద్ధతి’కి ఒక శాస్ర్తియ తీరు ఉంది. బిడ్డలకు తొలి చదువును ఏ భాషలో మొదలు పెట్టినా ఆ చెప్పే భాష మీద పట్టు ఉండాలి. తెలిసిన భాషలో పునాదులు వేసి దాని పునాదుల మీద ఎన్ని భాషలు అయినా, ఎన్ని శాస్త్రాలు అయినా నేర్పటం అనేది శాస్ర్తియ బోధనా పద్ధతి. తొలి చదువుల్లో స్వతహాగా అది అమ్మ భాషే అయి ఉంటుంది. అక్కడక్కడా తల్లి భాషే కాకుండా సమాజ భాష కూడా అయి ఉంటుంది. అయినా దీని కంటే తొలి పద్ధతే నూటికి నూరు పాళ్ళూ శాస్ర్తియం. రెండోది గుడ్డిలో మెల్ల. ఇది వేల కొద్ది పరిశోధనల్లో, అనుభవంలో తేలిన సత్యం. ప్రపంచం అంతా అనుసరిస్తున్న దారి. భాష మీద పట్టు లేకుండా చదివే బిడ్డలకు పుటుకతో వచ్చే తెలివి సామర్థ్యం, సృజనాత్మకత పాక్షికంగానే ఉపయోగం లోకి వస్తాయి అనేది కూడా అన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి.

అగ్రవర్ణాల పిల్లలు ఆది నుంచి ఇంగ్లీషు మీడియంలో చదవటం వల్ల పైకి ఎగ బాకుతున్నారు అనే వాదన ముందుకు తెచ్చి వారికి మల్లే దళితులకు కూడా ఎల్కేజీ నుండి ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పాలి అంటూ కంచె అయిలయ్య లాంటి మేథావులు కొత్తగా వాదన ముందుకు తెస్తున్నారు. శాస్ర్తియ బోధనా పద్ధతులను కాదని తమ నమ్మకాలకు తగ్గట్టు బోధన ఉండాలి అనేది వీరి వాదన.

ఇది మొండి వాదన, పిడి వాదన. మొండి వాదనకు కులం లేదా మతం సెంటిమెంటు జోడించి వాదనలు వినిపించటం వల్ల ఎదుటి వారు ఎంత శాస్ర్తియంగా మాట్లాడినా అది సెంటిమెంటు సరి చెయ్య లేదు. ఈ సంగతిని ప్రభుత్వ బడుల్లో గత ఏడాది ప్రవేశ పెట్టిన ‘సక్సెసు’ బడులు ఏ మేరకు సక్సెసు అయ్యాయో తెలుపకనే తెలిపాయి. అప్పటి వరకూ తెలుగులో చదువుతున్న పిల్లల్ని ఆశ పెట్టి, టార్గెట్లు పెట్టి ఇంగ్లీషు మీడియం లోకి తోసిన పిల్లలు మూడు నెలలు లోపే దాదాపు తిరిగి తెలుగు మీడియం లోకి గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వచ్చేసారు. మిగిలి ఉన్న ఆ కొద్ది పిల్లల భవిత రేపు జరిగే పదో తరగతి పరీక్షలు తేల్చనున్నాయి.

కులం, డబ్బు, హోదా, తెలివి, ఖరీదు అయిన కార్పోరేటు విద్య, ఇలా అన్ని అంశాలలో అనుకూలంగా ఉన్న పిల్లలకే పరాయి భాషలో ప్రాథమిక విద్య పనికి రాదని పరిశోధనలు, అనుభవాలు తెలుపుతున్నాయ. కులం, సామాజిక వెనుకబాటు అనే కంతలో నుంచి శాస్ర్తియ బోధనా పద్ధతులను ఎగతాళి చేస్తున్నారు వారు ఆశించినట్టుగా నిజంగా దళిత ఎదుగుదల జరగాలి అంటే అందుకు తిరుగులేని ఆయుధం దళితులకు వారి సొంత భాషలో తొలి చదువులను మొదలు పెట్టడం. దాని ద్వారా మంచి ఇంగ్లీషు నేర్పటం. వీరి వాదన దళితులకు మేలు చేయక పోగా వారిని అత్యంత కీడులోకి నెట్టేస్తుంది. స్వాతంత్య్రం వచ్చాక కూడా వ్యవసాయం, చేతి పనులు, కుల వృత్తులలో ఉన్న పేద, దళిత, గిరిజన కుటుంబాల పిల్లలకు చదువు అందని పండుగానే ఉండింది. అందుకు కారణం చదువుకొనే అవకాశాలు మెరుగు పడుతున్నప్పటికీ చదువులో భాష గుదిబండగా మారటం. అప్పట్లో ఒక పక్క ఇంగ్లీషు మీడియం, మరో వైపు తెలుగు పేరుతో గ్రాంథిక భాష రూపంలో ఉన్న సంస్కృత చదువుల వల్ల ఈ వర్గాలకు చెందిన పిల్లలు బడి అంటే హడలి పోయి దాని వైపు కనె్నత్తి చూడని పరిస్థితి ఉండింది. అంబేద్కరు పోరాట ఫలితంగా కలిపించిన రిజర్వేషను ఉద్యోగాలలోకి ఆయా వర్గాలను ఇముడ్చు కోవటానికి చదువుకున్న వారు దొరకని పరిస్థితులు ఆనాటివి.

గిడుగు రామ్మూర్తి లేవనెత్తిన ‘వాడుక భాష ఉద్యమం’ పుణ్యమా అని చదువులు దాదాపు వాడుక భాష లోకి దిగినాయి. అప్పటివరకూ చదువుకు దూరంగా ఉన్న దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల పిల్లలకే కాకుండా ఎగువ కులాల లోని నిరక్షరాస్య పిల్లలకు సయితం చదువు చేరువగా వచ్చింది. అంటే తల్లిదండ్రులకు చదువు లేక పోయినా పిల్లలు చదవటం అనేది చదువు వ్యవహారిక భాష లోకి దిగాక కానీ ఎక్కువ మొత్తంలో జరగ లేదు. మరో మాటలో చెప్పాలి అంటే చదువు సొంత భాష లోకి వచ్చాకే ఆయా వర్గాల ప్రజలలో ఉద్యోగాలు అందుకొనే తొలి తరం తయారు అయింది.

దళితులతో సహా ఆయా సామాజిక వర్గాలలో తొలి తరంలో విద్యా, ఉద్యోగాలు పొందగలిగిన వారు ఎంతో కొంత సామాజిక మట్టును పెంచు కోగలిగారు. దీని వల్ల అప్పటి పేదలు, దళితులు వెనుకబడిన వర్గాలు, గిరిజనులలో వారి వారి స్థాయి మేరకు ఆర్థికంగా ఎదిగారు. అలా ఎదిగిన వారు ఇప్పుడు తమ బిడ్డలకు ఇంకా మరింత మెరుగు అయిన విద్య, ఉపాధి కోసం ఎంత డబ్బు అయినా పెట్టి ఎగువ కులాలకు ధీటుగా చదువు చెప్పించటం కోసం కార్పోరేటు విద్య వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇపుడు దళితుల్లో ధనిక దళితులు, పేద దళితులు అనే రెండు వర్గాలు మనుగడలో ఉన్నాయి. ధనిక దళిత వర్గాల పిల్లలు ఇంగ్లీషు మీడియంలో ఎంతో కొంత రాణించటానికి కావాల్సిన కుటుంబ, ఆర్థిక వాతావరణ వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ చదువులో రాణించక పోయినా ఆర్థిక స్థితికి ఢోకా లేదు కాబట్టి వారికి పోయేది ఏమీ లేదు. ఎటొచ్చీ పేద దళిత పిల్లలకే జరిగే నష్టం అంతా. ఈ ఇంగ్లీషు మాధ్యమమే చదవాలనే వాదనే కనుక అమలు అయ్యే పరిస్థితే వస్తే అది ఇప్పుడిప్పుడే చదువు బాట పడుతున్న తొలి తరం దళిత పిల్లలను పైకి రానీయకుండా మొగ్గలోనే తుంచటమే అవుతుంది. అయితే అది నేరుగా కాకుండా అందంగా కనిపించే ఇంగ్లీషు మీడియం గుదిబండను వారి మెడలో వేలాడదీయటం ద్వారా జరుగుతుంది.

అలనాడు సొంత భాషలో చదివి, రిజర్వేషను ఉపయోగించుకొని పైకి వచ్చిన ధనిక దళితుల పిల్లలకు పోటీ లేకుండా చేయటమే దళితులకు ఇంగ్లీషు మీడియం అనే వాదన. అంటే ఉన్న రిజర్వేషను కోటా లోనికి కొత్తగా వచ్చే పేద దళిత పిల్లలు రాకుండా అడ్డుకొనే కుట్రలో భాగమే దళితులకు ఇంగ్లీషు మీడియం వాదన.
వారు గ్రహించాల్సింది ఏమిటి అంటే ఒక్క దళితులే కాదు. ధనికులు, ఎగువ కులాలు, వెనుకబడిన తరగతులు ఎవరు అయినా సరే తమ బిడ్డలకు పుట్టుకతో వచ్చిన తెలివితేటలు మొత్తం బయటికి వెలికి రావాలి అంటే అది తొలి చదువులు సొంత భాష ద్వారా జరిగినపుడే వీలు అవుతుంది.
                                  తొలి చదువులు వ్యాసాలు ఇంతటితో ముగిసాయి 



Saturday, February 9, 2013

ఇంకా బానిస చదువేనా?- తొలి చదువులు-31


9-2-2013
కాలం ఎప్పుడు నిలకడగా ఉండదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజపు పోకడలూ మారుతూ ఉంటాయి. విద్య సమాజంలో భాగంగా, సమాజానికి దన్నుగా, సమాజానికి అద్దం పట్టేదిగా ఉంటే సమాజంలో వచ్చే మార్పు లకు తగ్గట్టు విద్య ఉంటుంది. విద్య, దాని ద్వారా జరిగే పరిశోధనల వల్ల పుట్టుకు వచ్చే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సమాజ మార్పులను, ఉత్పత్తిని వేగిర పరుస్తాయి. అంటే సమాజం- విద్య విడదీయ రానివిగా ఉండేటట్టు ఆయా జాతులు తమవి అయిన విద్యా విధానాన్ని అనుసరిస్తాయి. అలాంటి సమాజంలో మారుతున్న కాలానికి, కొత్తగా వచ్చే భావాలకు తగ్గట్టు విద్యా విధానాలను ఎప్పటికి అప్పుడు మెరుగు పరచు కుంటాయి. అంతే కాకుండా విద్య ద్వారా ఆయా సమాజాల భాష, జీవన విధానం, సాంప్రదాయం, మతం, సాంస్కృతిక వారసత్వాన్ని తరువాత తరాలకు అందజేస్తాయి. అంటే కొత్తగా వచ్చే ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ జాతి ప్రయోజనాలకు వాడు కొనేందుకు మానవ వనరులను తయారు చేసు కోవటం తోపాటు భాష, సాంస్కృతిక వారసత్వ కొన సాగింపు కూడా విద్యలో భాగంగా ఉంటాయి. ఇది తమ కాళ్ళ మీద తాము నిల బడే జాతి, ఆత్మాభిమానం గల జాతి పాటించే పద్ధతులు. భారత ఉప ఖండంలో తప్పించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని జాతులు పాటించే విధానం ఇది.
సమాజం ముందు పోకలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న విద్య, దానికి పునాదులు వేసే ప్రాథమిక విద్యను గురించి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసు కుంటాయి. దానికి తగ్గట్టు పిల్లల తొలి చదువులు ఉంటాయి. మరయితే ఇప్పుడు మన పిల్లలు చదివే చదువులు ప్రపంచం అంతటా పాటించే పద్ధతుల్లో సాగుతుందా లేక పెడ దారిన పోతుందా? అని చూడాల్సిన అవసరం ఉంది.


భారత దేశానికి తెల్ల దొరలు రాక మునుపు వరకూ విద్య అనేది సాంప్రదాయ ముసుగులో కొన సాగుతూ వచ్చింది. చదువు అంటే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలే తప్ప జన జీవితానికి పనికి వచ్చే సంగతులు కానీ, జనాన్ని ముందుకు నడిపే చేవ కానీ అప్పటి విద్యకు లేదు. గట్టిగా చెప్పాలంటే ఉత్పాదనకు విద్యకూ ఏ రకమైన సంబంధం లేకుండా సాగింది. ఉత్పత్తితో ముడి పడని చదువుల్లో ఎదుగు బొదుగు ఉండదు. కాబట్టి కొన్ని వేల ఏళ్ళుగా చదువు అంటే వేదాలు పురాణాలే తప్ప మరొకటి కన పడని పరిస్థితి వచ్చింది. చదువుకున్న వారు ప్రబంధాలు రాసు కుంటూ కూర్చో గలిగారే కానీ సమాజపు ఉత్పత్తిలో చదువును భాగం చేయ లేక పోయారు. మరో వైపు ఉత్పత్తి రంగంలో ప్రధాన భూమికను పోషించే జనానికి చదువులో చోటు లేకుండా పోయింది. అందు వల్ల వ్యవసాయం, చేతి వృత్తుల్లో వచ్చే కొత్త కొత్త నైపుణ్యాలు, ఒరవడులు కుటుంబ పరంగా తరువాత తరానికి అందాల్సిందే కానీ బయట ప్రపంచానికి చాటటానికి వారికి నాలుగు అక్షరం ముక్కలు కరువు అయ్యాయి. కాబట్టే బయటి ప్రపంచానికి భారతదేశం అంటే ముక్కు మూసుకుని తపస్సు చేసే మనులు, వేదాలు, ఉపనిషత్తులే తప్ప ఆవిష్కరణలు లేని భూమిగా పేరు పడింది.
      

వేలాది ఏళ్ళుగా చదువు కేవలం కొన్ని కులాల, వర్గాల గుత్త ఆధిపత్యం కింద ఉండే పరిస్థితుల్లో తెల్ల దొరలు భారత ఉప ఖండంలోకి రంగ ప్రవేశం చేశారు. వారి చొరబాటు ముఖ్య ఉద్దేశం దోపిడి. ఇక్కడ సంపద అయితే ఉంది కానీ ఈ సంపదను తరలించ టానికి, దాన్ని పర్య వేక్షణ చేయటానికీ, లెక్కలు రాయ టానికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడ లేవు. ఏ ఉద్దేశ్యంతో అయితే వలస దారులు పాలక పగ్గాలను చే పట్టారో, ఆ పని జరగ టానికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడ లేవు. కాబట్టి కావాల్సిన మానవ వనరులను కూడా వారు తమ దేశం నుంచి తెచ్చు కోవాల్సి వచ్చేది. ఇది చాలా ఖర్చు, ప్రయాస లతో కూడిన పని. కాబట్టి ఈ నేలను దోచు కోవటానికి కావాల్సిన మానవ నరులను కూడా ఇక్కడే తయారు చేసు కోవాలి అనే ప్రతిపాదన వలస పాలకుల ముందుకు వచ్చింది.

తమకు అవసరం అయిన కూలి పనుల కోసం ఒక కొత్త తరాన్ని భారత గడ్డలో తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి తగ్గట్టు భారత విద్యా విధానంలో మార్పులు తీసుకు రావటానికి ఆనాటి వలస ప్రభుత్వం సంకల్పించింది. భారతదేశంలో ఏ రకమైన విద్యా విధానంలో ప్రవేశ పెట్టాలో అప్పటి బ్రిటీషు పార్లమెంటేరియను అయిన లార్డు మెకాలేను ఇండియాకు పిలిపించి ప్రతిపాదనలను కోరింది. దేశాన్ని నాలుగేళ్ళ పాటు గమనించి ఆయన తన ప్రతిపాదనలను బ్రిటీషు పార్లమెంటు ముందుంచే సమయంలో ఆయన చేసిన ఉపన్యాసం మన పరిస్థితికి అద్దం పడుతుంది.

‘‘నేను భారతదేశం నలువైపులా తిరిగి గమనించింది ఏమిటీ అంటే నా యాత్రలో నేను ఎక్కడా ఒక దొంగను కానీ, అడుక్కునే వాడిని కానీ చూడలేదు. భారతదేశంలో కావాల్సినంత సంపద ఉంది. వారసత్వ నైతికత, సాంస్కృతిక సంపదను పుణికిపుచ్చుకున్న చేవ అక్కడి ప్రజల సొత్తు. అది ఇలాగే ఉంటే భారత దేశాన్ని మనం లోబరచుకునే అవకాశం ఎప్పటికీ ఉండదు. భారతీయులు పాటించే ఈ వారసత్వ సంస్కృతి నడ్డి విరగ్గొడితే కాని మనం ఈ దేశంలో మకాం పెట్ట లేము అనేది నా తలపోత.
ఇక్కడి ప్రజల్లో పాతుకు పోయి ఉన్న సంప్రదాయ పద్ధతులను, విద్యా విధానాన్ని సమూలంగా పెకిలించి మనకు దాసోహంగా పడి ఉండే తరాన్ని తయారు చేయాలి. మన పద్ధతులను అక్కడి జనం బుర్ర ల్లోకి నాటాల్సి ఉంటుంది. మనం నాటే విదేశీయ మైన ఇంగ్లీషు సంస్కృతి, ఇంగ్లీషు భాష తమ సంస్కృతి, భాషల కంటే గొప్పవి అని భావించే బానిస తరాన్ని మనం తయారు చేసినట్టు అయితే వారే ఆ సమాజపు సాంస్కృతిక ఉనికిని, అస్థిత్వాన్ని పోగొట్ట టానికి పనికి వస్తారు. ఈ ఉద్దేశానికి తగ్గట్టు భారత దేశంలో మనం విద్యా విధానాన్ని అమలు పరచాల్సి ఉంటుంది’’.


మెకాలే బ్రిటీషు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికకు తగ్గట్టు భారత దేశంలో విద్యా విధానం అమలు అయింది. బయటకు అది బ్రిటీషు ప్రభుత్వానికి గుమాస్తాలను తయారు చేయటమే కానీ మాటు అజెండా మానసికబానిసలను తయారు చేయటమే. మెకాలే మూసలో తయారు అయిన విద్యా విధానాన్ని బ్రిటీషు ప్రభుత్వం స్వాతంత్య్రం ఇచ్చే నాటి వరకు అంటే నూరేళ్ళ పాటు అమలు పరిచింది.

స్వాతంత్య్రం వచ్చాక దాన్ని మార్చి మనది అయిన విద్యా విధానాన్ని కట్టు కున్నామా? అంటే అలాంటిది ఏమీ లేదు. కారణం ఏమిటి అంటే ఈ నూరేళ్ళలో మెకాలే ఆశించిన విధంగా ఇక్కడ బానిస జాతి కావాల్సిన దాని కంటే మెండుగా తయారు అయింది.


తెల్ల దొరలు చెప్పిన చదువులో నుంచి పుట్టుకు వచ్చిన భారత మేధావి వర్గం అంతా దాదాపు ఇదే. తనువులు భారతీయమే కానీ మనసులు ఇంగ్లీషు సంస్కృతికీ, ఇంగ్లీషు భాషకూ దాసోహులు. పాలనలో ప్రధాన భూమికను పోషించే బ్యూరోక్రట్లు, ఉన్నత చదువులు చదివిన రాజకీయ నాయకులు, విశ్వ విద్యాలయాలలో పని చేసే కులపతులు, ఆచార్యులు ఇందులో ముందు వరుసలో ఉన్న వారు. వీరు పాటించే ఈ మానసిక దాసోహానికి అప్పటి పేరు ఆధునికతఆ ఆధునికతకు నేటి కొన సాగింపు పేర్లే మార్కెట్టు, ఉద్యోగాలు, ప్రపంచీకరణ, గ్లోబలయిజేషను, విదేశీ ఉద్యోగాలు.
ఈ మొత్తం పరిణామాన్ని పరికించి చూస్తే సాంప్రదాయ పద్ధతిలో చదువు సాగినంత కాలం అది సమాజానికి పనికి ఉపయోగ పడనిదిగా ఉండటమే కాక ఆ ఉన్న చదువు కూడా కొద్ది మంది గుత్త ఆధిపత్యం  ఉండింది. దీనిని సంస్కరించి కొత్తగా వస్తున్న ఆధునిక పోకడలను మేళవించి మెరిగించిన విద్యను జనానికి అందుబాటులో తెచ్చి ఉండాలి. అలా తెచ్చి ఉన్నట్టు అయితే అలాంటి విద్య ద్వారా భాషా సంస్కృతులను, వారసత్వాన్ని కొనసాగించు కుంటూనే ఆధునికత వైపు ప్రయాణించే అవకాశం ఉండేది. బ్రిటీషు వలసకు ముందు జనానికి అందుబాటులో లేని, ఉత్పత్తిలో పాలు పంచు కోని సాంప్రదాయ విద్య నుండి నేరుగా బానిస విద్యా విధానం లోకి మరలాము. ఎంతగా మారాము అంటే తెలుగు చదివితే అవమాన పడేంతగా. 

మహుశా మెకాలే కూడా భారత జాతి నుంచి ప్రత్యేకించి తెలుగు జాతి నుంచి ఇంత బానినసత్వాన్ని ఆశించి ఉండడు.


Tuesday, February 5, 2013

పిల్లల్లో చదువు ఒత్తిడి- తొలి చదువులు-30


2-2-2013

ఒక వ్యక్తి ఆశించిన దానికీ, నిజంగా జరిగే దానికీ లేదా జరగ బోతున్న దానికి మధ్య ఉండే తేడానే ఒత్తిడి. ఒత్తిడికి గురి అయినపుడు అందుకు ప్రతిగా వారి మనసు, శరీరం స్పందిస్తాయి. ప్రతి వారికీ కొంత ఒత్తిడిని భరించే శక్తి ఉంటుంది. కలిగే ఒత్తిడి భరించే దానికన్నా తక్కువగా ఉంటే అది ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని దాటితే నష్టాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి పిల్లల చదువులో కొంత మేరకు ఒత్తిడి అవసరమే. అయితే అది వారి భరింపు గిరి లోనే ఉండాలి. అది కూడా ఎవరికి వారు ఒత్తిడిని తెచ్చి పెట్టు కోవాలి లేదా ఆ వయిపుగా పెద్ద వారు, టీచర్లు ప్రోత్సహించాలి. బలవంతంగా రుద్ద కూడదు. ఏ కారణం వల్ల అయినా పిల్లల చదువు ఒత్తిడి భరించ లేని స్థాయికి చేరింది అంటే మానసిక అలజడి (యాంగ్జయిటీ)కి లోను అవుతారు. దాంతో శారీరక ఆందోళన (టెన్షను) మొదలు అవుతుంది.

ఇది ఒత్తిడి యుగం. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు కాటికి కాళ్లు చాపుకున్న ముసలి వాళ్ళ వరకూ ఒత్తిడికి లోను కాని వారు అంటూ ఎవరూ ఉండరు. అయితే ఒత్తిడికి గురి అయిన సంగతిని వారు గుర్తించ వచ్చూ, గుర్తించ లేక పోవచ్చు. ఒత్తిడి కలగ టానికి గల కారణాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి ఉంటుంది. ఒత్తిడికి కలిగిన వ్యక్తిని బట్టీ దాన్ని అసలు గుర్తించ లేని స్థాయి మొదలు కొని ఆత్మహత్య చేసు కొనే వరకూ ఏ స్థాయిలో అయినా ఉండ ఒచ్చు. 

ఒత్తిడికి గురయ్యే వ్యక్తి, అతని మానసిక పరిణతి, వ్యక్తిత్వాన్ని బట్టీ ఫలితం ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకే రకపు ఒత్తిడికి గురి అయినపుడు ఒకరు దాన్ని అసలు ఒత్తిడి కింద పరిగణించక పోగా, రెండో వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చు కునేంతగా స్పందించ ఒచ్చు. ఒత్తిడికి స్పందించే తీరు వారి సర్దుబాటుతత్వం, సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం మీద ఆధార పడి ఉంటుంది.

పిల్లల మోతాదుకు మించి ఎక్కువ ఒత్తిడికి గురి అయినప్పుడు మనసుకు నిలకడ కుదరదు. అందువల్ల ఏ పని మీద ధ్యాస పెట్ట లేరు. నేర్చు కోవటం మందగిస్తుంది. నేర్చు కున్న విషయాలు సరిగా గుర్తుకు రావు. మతి మరుపు ఎక్కువ అవుతుంది, చిన్న చిన్న విషయాలకు తికమక పడతారు. ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఒస్తుంటాయి, వారి మీద వారికి నమ్మకం పోతుంది.. ఆలోచన లలో స్పష్టత లేక పోవటం వల్ల నిర్ణయాలు సరిగా తీసు కోలేరు. తట పటాయింపులు ఎక్కువ అవుతాయి. చదువుల మీద, ఆటల మీద ఆసక్తి కోల్పో తారు. ఎవ్వరితో కలవ టానికి ఇష్ట పడరు. తల్లిదండ్రులతో ముభావంగా ఉంటారు. బడికి వెళ్లనని మొరాయించ ఒచ్చు. ఇంట్లో వారి పట్ల తెలియ కుండానే వ్యతిరేక అనిపింపును ఏర్పరచు కుంటారు. ఇంటి నుండి పారి పోవటం, ఆత్మహత్యా ప్రయత్నం లాంటి చర్యలకు పాల్పడతారు. 

చిన్న పిల్లలు వారికి ఉన్న ఒత్తిడిని గుర్తించ లేరు. ఒత్తిడి వల్ల బాధ పడుతున్నాము అని కూడా వారికి తెలియదు. అలాంటప్పుడు వారి ఆందోళన శారీరక లక్షణాల రూపంలో బయట పెడుతుంటారు. తలనొప్పి, వొళ్ళు నొప్పులు, నిద్ర పట్టక పోవడం లేదా ఎప్పుడూ పడుకొని ఉండటం, ఆకలి మందగించటం లేదా అతిగా తినటం, నీరసంగా కనపడతారు.

ఒత్తిడివల్ల పిల్లల మీద కలిగించే దుష్ఫలితాలు పెద్ద వారితో పోలీస్తే చాలా తీవ్రంగా ఉంటాయి. కారణం ఏమిటంటే వారి మీద పడే ఒత్తిడి బయటకు కనిపించని విధంగా ఉంటుంది. పిల్లలు వారికి వారుగా ఒత్తిడిని గుర్తించ లేరు. పలానా కారణం వల్ల ఇబ్బంది పడు తున్నాము అని పెద్ద వారికి తెలియ చేయ లేరు. అందు వల్ల పిల్లల మీద ఒత్తిడి కొన సాగుతూనే ఉంటుంది. రెండోది పయిన చెప్పినట్టు ఒత్తిడి ఒక స్థాయి దాటితో అది చదువు మీద ప్రతికూల ప్రభావం చూపు తుంది కాబట్టి బిడ్డ భవిష్యత్తు వారి సామర్థ్యానికి తగ్గట్టు ఉండదు. చదువుకు సంబంధించిన కారణాలు అదనపు ఒత్తిళ్ళు ఇలా ఉంటాయి.
  1. మార్కులు, రాంకులు గురిగా నడిపే రెసిడెన్షియలు, కార్పొరేటు బడుల వల్ల
  2. పిల్లల వయసుకు మించి హోం వర్కు ఇవ్వటం
  3. విపరీతమయిన క్రమశిక్షణ పాటించడం
  4. సొంత భాషలో మాట్లాడ నివ్వక పోవటం, ఇంగ్లీషు లోనే మాట్లాడ మనటం
  5. వచ్చిన భాషలో తేలికగా నేర్చు కోవాల్సిన అంశాలు రాని భాషలో కష్టంగా ఉండటం 
  6. పిల్లలను అవమాన పరచే, చావబాదే టీచర్లు ఉన్నప్పుడు.
  7. చదివే పిల్లలు, చదవని పిల్లలు అని తేడా చూపించటం.
  8. శక్తికిమించిన గురిని ఇచ్చినపుడు
  9. పిల్లల చదువుల గురించి హయిరానా పడే తల్లిదండ్రులు ఉన్నప్పుడు.

పిల్లల పైన ఒత్తిడిని తగ్గించే పద్ధతులు:

  • పిల్లల శక్తికి మించిన చదువు నేర్పే ప్రయత్నం చేయ కూడదు.
  • చదువుపట్ల పిల్లల్లో ఆసక్తిని కలిగించాలే తప్ప బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయ కూడదు.
  • ఇంగ్లీషును పూర్తిగా నేర్పాకే దాన్ని బోధనా భాషగా తీసు కోవాలి. ప్రాథమిక తరగతుల్లో సొంత భాషలో బోధించటం వల్ల దాదాపు చదువు ఒత్తిడిని తగ్గించ చ్చు.
  • సరళమయిన, శాస్ర్తియమైన బోధనా పద్ధతులను టీచర్లకు నేర్పాలి.
  • బడి నుంచి వచ్చాక ట్యూషన్లు, కోచింగుల్లో ఇరికించ కూడదు.
  • పిల్లల్ని ఫలానా సమయంలో లేదా ఫలానా సమయం వరకు చదవమని బలవంత పెట్ట కూడదు. ఒక వేళ వారికయి వారు వాళ్ళు చదువు కుంటుంటే అభ్యంతరం కూడా చెప్ప కూడదు.
  • పిల్లల్ని ఎక్కువగా తమ ఈడు పిల్లలతో ఆడుకోనివ్వాలి. చదువు పేరుతో ఆటల సమయాన్ని కుదించకూడదు.
  • పరీక్షల సమయంలో కూడా 8 గంటల నిద్ర అవసరం. ఒత్తిడిని తగ్గించే ఒకే ఒక సహజ చికిత్స నిద్ర.
  • పిల్లలు మంచి ఫలితాలను సాధిస్తే అభినందించాలి. చిన్న చిన్న బహుమతులు కూడా ఇవ్వాలి. అలా అని దాన్ని అలవాటుగా మార్చ కూడదు.
  • పిల్లలకు పరిస్థితులకు అనుగుణంగా సర్దుకు పోవటం లేదా ఎదుర్కొనే నైపుణ్యాలను, నైపుణ్యాన్ని (కోపింగ్ స్కిల్స) అలవాటు చేయాలి.
  • మనసుకు హాయిని ఇచ్చే వినోద కార్యక్రమాలకు పిల్లలను దూరం చేయ కూడదు.
  • చదువు అంటే పరీక్షలు, మార్కులు, ర్యాంకులే కాక జీవితాన్ని గురించి తెలుసు కోవటం అనేదిగా ఉండాలి.
  • పిల్లల్ని ప్రతి విషయంలో అదుపాజ్ఞల్లో పెట్టడం మానెయ్యాలి.